Begin typing your search above and press return to search.

వివేకా మీద తొలి వేటు వేసింది అతడేనట.. దస్తగిరి సంచలనం

By:  Tupaki Desk   |   16 March 2022 11:49 AM GMT
వివేకా మీద తొలి వేటు వేసింది అతడేనట.. దస్తగిరి సంచలనం
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైఎస్ వివేకా దారుణ హత్యకు సంబంధించిన షాకింగ్ అంశాలు ఇప్పటికే బయటకు రావటం తెలిసిందే. ఈ సంచలన కేసును విచారిస్తున్న సీబీఐ.. పలువురు సాక్ష్యుల్ని విచారించి.. వారి వాంగ్మూలాన్ని సేకరించిన నేపథ్యంలో.. ఈ హత్యకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో వివేకా హత్యలో ఎవరి పాత్ర ఏమిటన్నది ముబ్బులు వీడుతున్నట్లుగా వీడిపోతున్నట్లుగా చెప్పాలి.

ఇప్పటికే హత్య జరిగిన తీరు.. హత్యకు వాడిన ఆయుధాలు.. హత్యలో పాలుపంచుకున్న వారి వివరాలు బయటకు వచ్చి సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి వివేకా మాజీ డ్రైవర్.. ఈ హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తన తాజా వాంగ్మూలంలో వివేకాను ఎవరు హత్య చేశారు. మొదటి వేటు ఆయనపై వేసింది ఎవరన్న అంశంతో పాటు.. హత్య సమయంలో ఏం జరిగిందన్న వివరాల్ని కూడా వెల్లడించారు. దీనికి సంబంధించిన అంశాలు సంచలనంగా మారాయి. ఇప్పుడు అంతకు మించిన షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

వివేకాను దారుణంగా హత్య చేసే సమయంలో హంతకులు దారుణాతి దారుణంగా వ్యవహరించినట్లుగా తాజాగా వెల్లడైన వాంగ్మూలం చెబుతోంది. వివేకాను హత్యకు ముందు బండ బూతులు తిడుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ.. గొడ్డళ్లతో నరికేశారట. ఇంతకూ దస్తగిరి ఏం చెప్పారన్నది అతడి మాటల్లోనే చెబితే.. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత హైదరాబాద్ వెళ్లిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద.. వైఎస్ జగన్ ను కలిసి వచ్చారు. ఆ తర్వాత అవినాష్ రెడ్డికి సన్నిహితుడైన శివశంకర్ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించావ్.. నీ అంతు చూస్తానని వివేకా హెచ్చరించారు.

అతడి దగ్గరే ఉన్న అవినాశ్ రెడ్డి.. భాస్కర్ రెడ్డి... మనోహర్ రెడ్డిని కూడా వివేకా వార్నింగ్ ఇచ్చారు. వీరి మాటల్ని విని మీరు నన్ను మోసం చేశారు.. మీ కథ కూడా తేలుస్తానన్నారు. 2017 నుంచి జరుగుతున్న ఒక ల్యాండ్ సెటిల్ మెంట్ లో గజ్జల జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు ఉమాశంకర్ రెడ్డి గంగిరెడ్డికి తోడయ్యారు. ఈ సెటిల్ మెంట్ అయ్యాక వివేకా బెంగళూరు యలహంక గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు గంగిరెడ్డి తన వాటాను అడిగారు. దీనిపై వివేకా ఆగ్రహం వ్యక్తం చేశారు’ అని పేర్కొన్నారు. అలా వారిద్దరి మధ్య చెడినట్లుగా చెప్పారు. ఆ తర్వాత దస్తగిరి వివేకా వద్ద డ్రైవర్ గా ఉద్యోగం మానేశారు.

అనంతరం గంగిరెడ్డి.. ఉమాశంకర్ రెడ్డి.. దస్తగిరి అంతా ఏకమయ్యారు. భూమికి సంబంధించిన డీల్ లో తనకు వాటా ఇవ్వని వివేకా మీద కక్ష పెంచుకున్న గంగిరెడ్డి.. తనకు సన్నిహితులైన ఉమాశకంర్ రెడ్డి.. సునీల్ యాదవ్.. దస్తగిరిని పిలిచి హత్యకు కుట్ర చేశారు. ముందుగా వివేకాను చంపాలని.. ఆయనకు మాజీ డ్రైవర్ గా ఉన్న దస్తగిరికి చెప్పారు. దీనికి అతడు.. తాను ఎలా చంపగలనంటే.. తామంతా ఉంటామని చెప్పినట్లుగా పేర్కొన్నారు.

‘నాకు ధైర్యం చెప్పారు. మన వెనుక అవినాష్.. భాస్కర్ రెడ్డి.. మనోహర్ రెడ్డి ఉన్నారని చెప్పారు. వాళ్లకు సహకరిస్తే లైఫ్ సెటిల్ చేస్తామన్నారు. దీంతో ఒప్పుకున్నా. దీంతో.. హత్య ఎలా చేయాలన్న దానిపై ప్లానింగ్ మొదలు పెట్టారు. వివేకా ఇంట్లోకి వెళ్లేందుకు అడ్డుగా ఉండే కుక్కను మొదట చంపాలనుకన్నారు. అందుకు గంగిరెడ్డి.. సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెుడ్డి సాయంతో చంపేశారు’ అని చెప్పాడు.

దస్తగిరికి రూ.75 లక్షలు ఇచ్చిన గంగిరెడ్డి.. రూ.25 లక్షలు సునీల్ యాదవ్ కు ఇచ్చాడు. వివేకా ఇంటి వాచ్ మెన్ రాజశేఖర్ లేని వేళ చూసుకొని సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డి కారుతో తొక్కించి కుక్కను చంపేశారు. దీంతో.. వివేకా ఇంట్లోకి వెళ్లేందుకు అడ్డంకి లేకుండా పోయింది. 2019 మార్చి 13 నుంచి మూడు రోజుల పాటు వాచ్ మెన్ రాజశేఖర్ కాణిపాకం వెళుతున్నట్లుగా తెలుసుకున్నారు. హత్కకు మార్చి 14ను ముహుర్తంగా ఫిక్స్ చేశారు. ఆ రోజు రాత్రి 11.45 గంటల వేళలో ఇంట్లోకి వివేకా కారు వెళ్లటం చూసుకొని పరస్పరం ఫోన్ లు చేసుకొని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దస్తగిరి కొన్న గొడ్డలిని తీసుకొని వెళ్లాడు.

సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డితో కలిసి రాత్రి వరకూ మద్యం తాగిన దస్తగిరి అర్థరాత్రి 1.30 గంటల తర్వాత ఇంట్లోకి వచ్చాడు. తలుపు కొట్టగా.. లోపల వివేకాతో కలిసి ఉన్న గంగిరెడ్డి తలుపు తీశాడు. వివేకాకు అనుమానం వచ్చి.. ప్రశ్నించాడని దస్తగిరి చెప్పాడు. ‘ల్యాండ్ సెటిల్ మెంట్ డబ్బులు కోసం వచ్చారని చెప్పారు. ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో మాకు డబ్బులు ఇవ్వలేదంటూ గంగిరెడ్డి.. సునీల్ యాదవ్.. ఉమాశంకర్ రెడ్డిలు వివేకాను బూతులు తిట్టటం మొదలు పెట్టారు. ఉన్నట్లుండి వివేకా ముఖం మీద సునీల్ యాదవ్ బలంగా కొట్టాడు. అదే సమయంలో ఉమాశంకర్ రెడ్డికి దస్తగిరి గొడ్డలి అందించాడు. దాంతో వివేకా తలపై ఉమాశంకర్ రెడ్డి తొలి వేటు వేశాడు. తర్వాత తల వెనుక వేటు వేశారు. సునీల్ యాదవ్ వివేకా ఛాతీ మీద 15 సార్లు కొట్టాడు. ఆ తర్వాత వివేకాను మోకాళ్ల మీద కూర్చోబెట్టి ఒక లెటర్ రాయించాలని నిర్ణయించుకున్నాం.

ల్యాండ్ సెటిల్ మెంట్ కు సంబంధించిన పత్రాల కోసం వెతికారు. కానీ.. అవి దొరకలేదు. ఈ లేఖలో తమ పేరుతో ఆస్తి రాయించుకోవాలని అనుకున్నారు. కానీ.. వివేకా రాయలేదు. దీంతో రాస్తే వదిలేస్తామని.. లేదంటే చంపేస్తామన్నారు. చివరకు నా డ్రైవర్ ప్రసాద్ ను డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చంపబోయాడు.. అతన్ని వదిలి పెట్టొద్దని వివేకాతో రాయించారు.ఆ తర్వాత బాత్రూంలోకి తీసుకెల్లి చంపేద్దామని గంగిరెడ్డి చెబితే.. మిగిలిన వాళ్లు లాక్కెళ్లారు. అక్కడ వివేకా తలపై ఉమాశంకర్ రెడ్డి నాలుగైదు గొడ్డలి పోట్లు వేయగా.. సునీల్ యాదవ్ వివేకా మర్మాంగాన్ని తన్నాడు. దీంతో వివేకా ప్రాణాలు పోయినట్లు తెలుసుకున్నారు.

తర్వాత ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. తర్వాత గంగిరెడ్డి ముందుగా పారిపోయాడు. వాచ్ మెన్ రంగన్న ఎవరు? అని ప్రశ్నిస్తుంటే మిగిలిన వారు గోడ దూకి పారిపోయారు. అనంతరం రాజారెడ్డి ఆసుపత్రికి వెళ్లి కాళ్లు.. ముఖంపై రక్తపు మరకలు కడుక్కున్నా’’ అని దస్తగిరి వెల్లడించారు. సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలానికి మిగిలిన నిందితులు.. తనను బెదిరిస్తున్నారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. దస్తగిరి వాంగ్మూలాన్ని చూసినప్పుడు.. ఇంత కర్కశంగా.. కిరాతకంగా చంపటమా? అన్న షాకింగ్ గా మారుతుందని చెప్పక తప్పదు.