Begin typing your search above and press return to search.

ఢిల్లీపై మళ్లీ పీటముడి..న్యాయ‌పోరాటానికి రెడీ

By:  Tupaki Desk   |   5 July 2018 5:33 PM GMT
ఢిల్లీపై మళ్లీ పీటముడి..న్యాయ‌పోరాటానికి రెడీ
X
దేశ రాజ‌ధాని ఢిల్లీలో రాజ‌కీయ ఉత్కంఠ‌కు తెర‌ప‌డ‌టం లేదు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా ఢిల్లీలో పాలనాపరమైన ప్రతిష్టంభన కొనసాగుతోంది. మూడు అంశాలు మినహా కార్యనిర్వాహక నిర్ణయాలన్నీ ఢిల్లీలో ఎన్నికైన ప్రజాప్రభుత్వం తీసుకోవచ్చునని స్పష్టంచేసినప్పటికీ - అధికారులు మాత్రం ఆప్‌ ప్రభుత్వ ఆదేశాల అమలుకు సిద్ధంగా లేరు. బుధవారంనాటి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత.. సిబ్బంది నియమాకాల - బదిలీల అధికారాన్ని ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు బదలాయిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే వాటిని అమలు చేసేందుకు సేవల విభాగం నిరాకరించింది. వాటికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మాత్రమే ఇన్‌ చార్జ్‌ అని పేర్కొన్నది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆప్‌ ప్రభుత్వానికి అధికారాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడంలేదు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొత్తగా అధికారాలేమీ ఇవ్వలేదని కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీ చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్రపాలిత ప్రాంత (యూటీ) కేడర్‌ అధికారులపై తమకు అధికారాన్ని కట్టబెట్టిందంటూ ఆప్‌ ఊహించుకుంటున్నదని, అది పూర్తిగా తప్పని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్పు రాష్ట్రప్రభుత్వానికికానీ - కేంద్ర ప్రభుత్వానికి కానీ కొత్తగా అధికారాలివ్వలేదని - అదే సమయంలో ఉన్న అధికారాలను తగ్గించలేదని జైట్లీ వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు తీర్పుపై ఆప్‌ నేతలు హర్షం వ్యక్తంచేస్తూ సంబురాలు చేసుకోవడాన్ని జైట్లీ విమర్శించారు. తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన వ్యాఖ్యానిస్తూ.. ‘ఎన్నికైన ప్రజాప్రభుత్వపు ప్రాధాన్యతను సుప్రీంకోర్టు తన తీర్పులో నొక్కిచెప్పింది. కానీ, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) అయిన కారణంగా దాని అధికారాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకే వస్తాయి’ అని ఆయన తెలిపారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమని.. పోలీసులు - శాంతిభద్రతలు - భూవ్యవహారాలపై కేంద్రానికే అధికారం ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగుల నియామకాలు - బదిలీలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ‘బయటకు చెప్పుకోలేని అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వాటి ప్రాముఖ్యతను గుర్తించి - చర్చించి - న్యాయస్థానం ప్రత్యేకంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే బాగుండేది. వాటిపై కోర్టు ఏమీ చెప్పనంత మాత్రాన.. ఏదో ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు కాదు. సుప్రీంకోర్టు తీర్పు నుంచి రెండు అంశాలను గ్రహించాలి. ఒకటి.. ఢిల్లీ ప్రభుత్వానికి పోలీసు అధికారాలు లేకపోతే - గతంలోలాగా ఇకపై నేరాలు జరిగినప్పుడు దర్యాప్తు బృందాలను నియమించలేదు. రెండు.. ఎన్నికైన ప్రజాప్రభుత్వం ఉన్నప్పటికీ దేశరాజధాని ప్రాంతం (ఎన్సీటీ)ని కలిగిన ఢిల్లీ యూటీ అయినందున ఇతర రాష్ట్ర ప్రభుత్వాల తరహా అధికారాలేవీ ఇక్కడ వర్తించవు. అందువల్ల యూటీ క్యాడర్‌ అధికారులు - వారి పరిపాలన ఢిల్లీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలని అనుకోవడం తప్పే అవుతుంది’ అని జైట్లీ వివరించారు. మంత్రివర్గం కానీ - కేజ్రీవాల్‌ ప్రభుత్వం కానీ ఢిల్లీ రాష్ట్రం కాదన్న విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికైన ప్రజాప్రభుత్వం - లెఫ్టినెంట్‌ గవర్నర్‌ - కేంద్ర ప్రభుత్వం సఖ్యతతో కలిసి పనిచేయాలని కోర్టు సూచించిన విషయాన్ని జైట్లీ గుర్తుచేశారు.

ఇదిలాఉండ‌గా... ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో స్పందించారు. ఢిల్లీలో ప్రజలచేత ఎన్నికైన ప్రభుత్వానిదే పాలనాధికారమని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తున్నదని అన్నారు. తీర్పుపై ఆయన గురువారం లెప్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కు లేఖ రాశారు. ‘ప్రతీ విషయంలో మీ అనుమతి అక్కర్లేదని కోర్టు తెలిపింది. ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని పనిచేసుకోనీయండి. రోజువారీ వ్యవహారాలకు, ప్రతీ నిర్ణయాలకు మీ సమ్మతి ఇకపై అవసరం లేదని గ్రహించండి. అదే సమయంలో తీసుకునే ప్రతీ నిర్ణయంపైనా ప్రభుత్వం మీకు సమాచారమిస్తుంది’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. పోలీస్‌ - శాంతిభద్రతలు - భూవ్యవహారాలు మినహా మిగతా అన్ని అంశాల్లో మంత్రివర్గానిదే తుదినిర్ణయమని ఆయన తెలిపారు. ‘ఒకవేళ ఏదైనా అంశంపై మీరు సుముఖంగా లేకపోతే, మా దృష్టికి తెండి. నేను కానీ, నా క్యాబినెట్‌ సహచరులు కానీ మీ వద్దకు వచ్చి మరీ వివరిస్తాం’ అని కేజ్రీవాల్‌ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు అందరం సమష్టిగా పనిచేసి ఢిల్లీ అభివృద్ధికి పాటుపడదామని కేజ్రీవాల్‌ ఉద్యోగులను, ప్రభుత్వ సిబ్బందిని కోరారు.

మ‌రోవైపు సుప్రీంకోర్టు తన చారిత్రక తీర్పును వెలువరించిన గంటల వ్యవధిలోనే అధికారుల నియమాకాల - బదిలీలకు సంబంధించిన అధికారాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నుంచి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కు బదలాయిస్తూ ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను అమలు చేసేందుకు సేవల విభాగం నిరాకరించింది. బదిలీలు, పోస్టింగుల అధికారం ఎల్జీకి అప్పగిస్తూ 2015లో హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ను సుప్రీంకోర్టు రద్దు చేయలేదని తెలిపింది. ఇప్పటికీ హోంశాఖ ఆదేశాలే చెల్లుబాటవుతాయని.. బదిలీలు - నియామకాలకు ఎల్జీయే ఇన్‌ చార్జ్‌ గా కొనసాగుతారని ఐఏఎస్‌ అధికారులు స్పష్టంచేస్తున్నారు. సుప్రీంకోర్టు తన 585 పేజీల తీర్పులో ప్రజలు ఎన్నికున్న ప్రభుత్వానిదే పాలనాధికారమని స్పష్టం చేసిందని - అయితే సేవల గురించికానీ - ఇతర విభాగాల గురించి సుప్రీంకోర్టు తీర్పులో ప్రత్యేకించి ఏమీ పేర్కొనలేదని వారంటున్నారు. అధికారుల వ్యవహారశైలిని ఆప్‌ తీవ్రంగా తప్పుపడుతున్నది. పోలీస్‌ - శాంతిభద్రతలు - భూవ్యవహారాలు మినహా అన్నిటిలోనూ ప్రభుత్వానిదే తుది నిర్ణయమని స్పష్టం చేసిందని నేతలు గుర్తు చేస్తున్నారు. ఎల్జీకి ఎలాంటి స్వతంత్ర నిర్ణయాధికారం లేదని సుప్రీంకోర్టు తెలిపిందని - అలాంటప్పుడు ఆయన బదిలీలు - నియామకాలపై ఎలా సొంతంగా నిర్ణయం తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ అధికారులు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా లేరని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా పేర్కొన్నారు. ‘కేంద్రం - ఎల్జీ - కొంతమంది అధికారులకు ఇష్టంలేకపోవచ్చు. అయినప్పటికీ కోర్టు అదేశాలను అమలు చేసి తీరాల్సిందే. ఇది ఇష్టాయిష్టాలకు సంబంధించినది కాదు. పాలనకు సంబంధించిన వ్యవహారం. కోర్టు ఆదేశాలను అధికారులు ఉల్లంఘించడంపై న్యాయకోవిదులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని సిసోడియా వెల్లడించారు. ఎన్నికైన ప్రభుత్వం పాలన సాగించకుండా అవరోధాలు కల్పించకూడదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పినప్పటికీ కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయని వారిపై కోర్టు ఉల్లంఘన పిటిషన్‌ దాఖలు చేసేందుకు ఆప్‌ సర్కార్‌ సిద్ధ్దమవుతోంది.