Begin typing your search above and press return to search.

ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఏపీని.. విజయసాయిని ఇరుకున పెట్టేస్తుందే

By:  Tupaki Desk   |   21 Nov 2022 6:30 AM GMT
ఢిల్లీ లిక్కర్ స్కాం.. ఏపీని.. విజయసాయిని ఇరుకున పెట్టేస్తుందే
X
ఢిల్లీలో బయటపడిన లిక్కర్ స్కాం ప్రకంపనలు రెండు తెలుగురాష్ట్రాల్ని బలంగా తాకుతున్న సంగతి తెలిసిందే. చూసేందుకు తెలంగాణలో మాత్రమే ఉన్నట్లు కనిపించినా.. లోతులు.. వాటి జాడలు మాత్రం ఏపీ వద్దకు ఆగుతున్నట్లుగా చెబుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై అదే పనిగా విరుచుకుపడే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఫ్యామిలీకి ఢిల్లీ లిక్కర్ స్కాం పెద్ద తలనొప్పిగా మారుతోంది.

ఈ ఎపిసోడ్ తో పాత విషయాలు.. ఇప్పటికి పెద్దగా ప్రచారంలో లేని కొత్త విషయాలు తెర మీదకు వస్తున్నాయి. అవన్నీ కలిసి విజయసాయిని మరింత ఇరిటేట్ చేసేలా మారుస్తున్నాయన్న మాట వినిపిస్తోంది. తాజాగా విజయసాయి రెడ్డి ఫ్యామిలీని వేలెత్తి చూపించేలా పరిస్థితి మొదలైంది. దీనికి కారణం విజయసాయి రెడ్డి ఒక్కగానొక్క అల్లుడి అన్న మరెవరో కాదు.. శరత్ చంద్రారెడ్డి. అవును.. అరబిందో ఫార్మాకు డైరెక్టర్ గా వ్యవహరించిన ఆయన.. ఏపీ క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడన్న విషయం తెలిసిందే.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రస్తుతం అరెస్టులో ఉన్న ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే.. ఒక స్కాంలో నిందితుడిగా ఉన్న వ్యక్తిని ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష స్థానంలో ఎలా ఉంచుతారు? అన్న ప్రశ్న తెర మీదకు వస్తోంది. అదే సమయంలో.. ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్ష పదవి సైతం విజయసాయి రెడ్డి అల్లుడికి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం కావటాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ లో అధ్యక్ష స్థానం.. ఉపాధ్యక్ష స్థానం రెండూ విజయసాయి రెడ్డి ఫ్యామిలీ చేతిలో ఉండటమా? అన్న విస్మయం తాజాగా వ్యక్తమవుతోంది.

తాజాగా జరిగే ఎపెక్స్ ఎన్నికల్లో శరత్ చంద్రారెడ్డిని అధ్యక్షుడిగా.. ఉపాధ్యక్షుడిగా అల్లుడు రోహిత్ రెడ్డి.. విజయసాయికి అత్యంత సన్నిహితంగా ఉండే గోపీనాథ్ రెడ్డి (విశాఖకు చెందిన వ్యాపారవేత్త) కార్యదర్శి పదవికి.. ఇతర సన్నిహితులు కూడా బోర్డులోకి రానున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు. కానీ.. దీనికి సంబంధించి ఇప్పటివరకు ఒక్కొక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. దీంతో.. ఎన్నిక లాంఛమని చెబుతున్నారు.

వచ్చే మూడేళ్లు ఏపీ క్రికెట్ అసోసియేషన్ ను విజయసాయి ఫ్యామిలీనే ఏలబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. క్రికెట్ సంఘం ఎన్నికల అధికారిగా వైఎస్ కు అత్యంత సన్నిహితుడు.. ఆయన సీఎంగా వ్యవహరించిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించినప రమాకాంత్ రెడ్డిని నియమించటం గమనార్హం.

క్రికెట్ సంఘాలపై రాజకీయ పెత్తనం మామూలే అయినా.. ఏపీలో మాత్రం అది పరాకాష్ఠ స్థాయికి చేరుకుందన్న మాట ఇప్పుడు అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇవన్నీ ఇప్పుడు విజయసాయికి కొత్త తలనొప్పిగా మారాయి. ఈ విషయాల్లో ఏ మాత్రం తేడా వచ్చినా.. కుటుంబంలో విజయసాయికి ఇబ్బందికి గురి చేస్తుందన్న మాట వినిపిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.