Begin typing your search above and press return to search.

గోడను ఢీకొట్టిన మెట్రో రైలు

By:  Tupaki Desk   |   20 Dec 2017 4:54 AM GMT
గోడను ఢీకొట్టిన మెట్రో రైలు
X
ఢిల్లీ మెట్రో ఇవాళ రెండు ప్ర‌ధాన వార్త‌ల‌తో తెర‌మీద‌కు వ‌చ్చింది. ఒక‌టి ప్ర‌మాదం కాగా...ఇంకోటి ప్ర‌మాదం చోటుచేసుకునేందుకు కార‌ణ‌మైన మార‌ణాయుధం. మొద‌టి అంశానికి వ‌స్తే...ఢిల్లీలోని మెజెంటా మెట్రో రైలు లైనులో పెను ప్రమాదం తప్పింది. ఈ నెల 25న ప్రారంభోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం మెట్రో రైలుకు ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రమాదవశాత్తు కలింది కుంజ్ డిపో వద్ద మెట్రో రైలు గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఆటోమేటిక్ బ్రేక్‌ లు ఫెయిల్ అవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రైలులోని రెండు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ ఈ నెల 25న మెట్రో రైలును ప్రారంభించనున్నారు. కాల్కజీ మందిర్ - బొటానికల్ గార్డెన్ మార్గంలో ఈ రైలు న‌డ‌వ‌నుంది. ఈ మెట్రో రైలు మార్గంలో ప్రయాణిస్తే దక్షిణ ఢిల్లీ - నోయిడా మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ నేప‌థ్యంలో మెట్రో ప్రారంభానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌రోవైపు అధికారులు దీనిపై క్షుణ్ణంగా అధ్య‌యనం చేస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...ఢిల్లీ మెట్రో స్టేషన్‌ లో కలకలం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి బ్యాగులో కంట్రీమేయిడ్ పిస్తోల్ కలిగి ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. నెహ్రు మెట్రో స్టేషన్‌ లో ఈ సంఘటన జరిగింది. స్కానింగ్ చేస్తున్న సమయంలో బ్యాగులో ఉన్న తుపాకి గుర్తించి ఎస్ మిశ్రా(21)ని అరెస్టు చేసినట్లు సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు. మిశ్రా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో వాసిగా విచారణలో తేలింది. తుపాకులు - మారాణాయుధాలు తీసుకెళ్లడం ఢిల్లీ మెట్రోలో నిషేదం ఉంది.