Begin typing your search above and press return to search.

ఢిల్లీ మెట్రో ‘ట్రయల్’ లో యాక్సిడెంట్ సీన్

By:  Tupaki Desk   |   5 Nov 2016 10:27 AM GMT
ఢిల్లీ మెట్రో ‘ట్రయల్’ లో యాక్సిడెంట్ సీన్
X
ఢిల్లీ మెట్రో ఎప్పుడో మొదలైంది కదా? మళ్లీ ఈ ట్రయిల్ రన్ ఏమిటి?.. యాక్సిడెంట్ ఏమిటి? అన్న సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పటికే ఢిల్లీ మెట్రో విజయవంతంగా నడుస్తోంది. అయితే.. మెజెంటా లైన్ ప్రాజెక్టులో మెట్రో రైల్ ప్రాజెక్టును విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఊహించని రీతిలో ఇక్కడ నిర్వహిస్తున్న ట్రయల్ రన్ లో ఒకే ట్రాక్ మీదకు వచ్చిన రెండు రైళ్లు ఢీ కొన్న ఘటన చోటు చేసుకుంది.

డ్రైవర్ రహిత రైళ్లను నడిపేందుకు వీలుగా ఢిల్లీ మెట్రో ప్రత్యేకంగా మెజెంటా లైన్ నిర్మాణాన్ని చేపట్టింది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2017 మధ్య నాటికి ఈ మెట్రో రైల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నది అధికారుల అంచనా. ఇందులో భాగంగా ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. జానక్ పురి వెస్ట్.. బొటానికల్ గార్డెన్ మధ్య 25 స్టేషన్లను కలుపుతూ కొత్త కారిడార్ ను నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ రోజు నిర్వహించిన ట్రయల్ రన్ లో ఒకే ట్రాక్ మీద రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్నాయి. సిగ్నలింగ్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే.. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. తాజా ఉదంతం నేపథ్యంలో అనుకున్న సమయానికి మెట్రో రైల్ పట్టాల మీదకు ఎక్కుతుందా? లేదా? అన్నది సందేహంగా మారిందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/