Begin typing your search above and press return to search.

మందు దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్. సర్కార్ తగ్గిందా...?

By:  Tupaki Desk   |   19 Nov 2022 2:50 PM GMT
మందు దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్. సర్కార్ తగ్గిందా...?
X
మద్యం షాపులలో ఈ రోజు దాకా నగదు చెల్లింపులే పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఏపీవ్యాప్తంగా ఉన్న మద్యం షాపులలో మందు అమ్మకాల ద్వారా నెలకు మూడు వేల రూపాయల భారీ ఆదాయం వస్తోంది. ఇంత పెద్ద మొత్తం ఈ రోజుల్లో ఈ డిజిటల్ యుగంలో కేవలం కరెన్సీ మీదనే కనిపిస్తోంది.

దీంతో దీని మీద ఆరోపణలు గత కొన్నేళ్ళుగా వస్తూనే ఉన్నాయి. అన్నింటికీ డిజిటల్ పేమెంట్ అమలులో ఉన్న వర్తమాన కాలంలో మద్యం దుకాణాలలో మాత్రం డబ్బు చెల్లింపులు ఎందుకు అని విపక్షాలు నిలదీశాయి కూడా. దీని వల్ల డబ్బు అక్రమంగా అడ్డదారులలో చేతులు మారుతోందని, అలాగే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని మొత్తుకున్నాయి కూడా.

విషయానికి వస్తే ఏపీలో పెద్ద ఎత్తున మద్యం దుకాణాలు వైసీపీ వారి చేతులలో ఉన్నాయని ప్రచారంలో ఉన్న మాట. ఇలా తప్పుల తడకల అకౌంట్స్ తో బ్లాక్ మనీ పెద్ద ఎత్తున పోగు అవుతోందని అది వైసీపీ నేతల జేబులలోకి పోతోందని విపక్షాలు విమర్శలు చేశాయి కూడా.

ఈ మధ్యనే గన్నవరం, బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఇలా పెద్ద ఎత్తున నగదు ఇతర ప్రాంతాలకు తరలిపోయింది అన్న విమర్శలు వచ్చిన నేపధ్యమూ ఉంది. ఇలా మూడున్నరేళ్ళు ఇట్టే సాగిపోయిన క్రమంలో ఇపుడు ప్రభుత్వం అర్జంటుగా డిజిటల్ పేమెంట్స్ కి మద్యం దుకాణాలలో అమలు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21 నుంచి దీన్ని అమలు చేయనున్నారు.

అయితే అంతటితో సంతోషించడానికి ఏమీ లేదు. నగదు చెల్లింపులను కూడా కొనసాగిస్తూనే డిజిటల్ చెల్లింపులను కూడా అనుమతిస్తున్నారు. దీనికి ప్రభుత్వ వర్గాలు చెప్పే విషయం ఏమిటి అంటే మద్యం దుకాణాలలో సిబ్బంది చేతి వాటం చూపిస్తూ లెక్కలు సరిగ్గా చూపడం లేదని, దాన్ని సవరించే ప్రయత్నం కోసమే ఇలా అని అంటున్నారు.

అలా సిబ్బంది చేతివాటం చూపిస్తున్నా అది చాలా తక్కువ శాతం మాత్రమే. అదే టైం లో షాపులను అడ్డుపెట్టుకుని బ్లాక్ మనీకి తెర లేపిన పెద్ద మనుషుల విషయం మీదనే విపక్షాలు రచ్చ చేశాయి. ఇంత చేసినా కూడా ప్రభుత్వం డిజిటల్ చెల్లింపులను ఒక ఆప్షన్ గానే పెట్టుకుంది అంటున్నారు.

ఒకవేళ డిజిటల్ చెల్లింపులకు సాంకేతిక కారణాలు చూపించి నగదు చెల్లింపులనే కొనసాగించినా కూడా తప్పు లేదు అనే అంటున్నారు. దీని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఏంటి అంటే పాము చావకుండా కర్ర విరగకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని విపక్షాలు అంటున్నారు. నిజానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నగదు చెల్లింపులు లేని డిజిటల్ చెల్లింపులను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దానికి సర్కార్ ఓకేనా.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.