Begin typing your search above and press return to search.

డిగ్గీ హ‌డావుడి వ‌ద్దు.. కేటీఆర్ కూల్ బెట‌ర్‌!

By:  Tupaki Desk   |   11 Jun 2018 6:36 AM GMT
డిగ్గీ హ‌డావుడి వ‌ద్దు.. కేటీఆర్ కూల్ బెట‌ర్‌!
X
ప్ర‌జా జీవితంలో ఉన్న వారు.. ప్ర‌ముఖులు ఆచితూచి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించాలి. చ‌టుక్కున ఏ విష‌యం మీదా రియాక్ట్ కావ‌టం అంత మంచిది కాదు. తొంద‌ర‌ప‌డితే లాభం కంటే ఎక్కువ న‌ష్టమ‌న్న వైనాన్ని గుర్తించిన కొంద‌రు నేత‌లు అభాసుపాలు కాకుండా ఉంటే.. ఆ విష‌యంలో త‌ప్పులో కాలేసి అడ్డంగా బుక్ కావ‌టం మ‌రికొంద‌రు నేత‌ల్లో క‌నిపిస్తోంది.

హైద‌రాబాద్ మెట్రో రైలు ప్రారంభానికి కాస్త ముందుగా.. ఒక ఫోటో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది.మెట్రో ఫిల్ల‌ర్ దెబ్బ తిన్న‌ద‌ని.. క‌ట్ అయ్యిందంటూ ఒక ఫోటో సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ప్ర‌చారం జ‌రిగింది. వెంట‌నే వాటికి చెక్ చెబుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెంట‌నే రియాక్ట్ అయి.. ఆ ఫోటో పాకిస్థాన్‌ కు చెందింద‌ని.. అలాంటి ప్ర‌మాద‌మేమీ లేదంటూ క్లారిటీ ఇచ్చి.. దాని వివ‌రాల్ని వివ‌రంగా షేర్ చేశారు. దీంతో.. ఆ ఫోటో చ‌క్క‌ర్లు చుట్ట‌టం ఆగిపోయింది.

ఇలాంటి భ‌య‌పెట్టే చిత్రాలు.. వెంట‌నే వైర‌ల్ అయ్యే చిత్రాల్ని ఒక రాష్ట్రం త‌ర్వాత మ‌రో రాష్ట్రంలో ప్ర‌చారానికి తెస్తున్నారు. తాజాగా ఇదే ఫోటో విష‌యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ త‌ప్పులో కాలేసి అడ్డంగా బుక్ అయ్యారు. భోపాల్ రైల్వే బ్రిడ్జి ఫోటో ప‌రిస్థితి ఇదంటూ డిగ్గీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. ఇదంతా ఉత్తుత్తి ఫోటో అని.. వాస్త‌వానికి రైల్వే బ్రిడ్జ్ బాగానే ఉందంటూ ఒక మీడియా సంస్థ డిగ్గీ తొంద‌ర‌పాటును గ‌ర్హిస్తూ ఒక క‌థ‌నాన్ని ప్ర‌చురించారు.

దీనిపై స్పందించిన దిగ్విజ‌య్ తాను చేసింది త‌ప్పు అని ఒప్పుకున్నారు. త‌ప్పు త‌న‌దేన‌ని.. క్ష‌మిచాల‌ని.. త‌న‌కు ఒక స్నేహితుడు పంపిన ఫోటోను క్రాస్ చెక్ చేసుకోకుండా షేర్ చేసి త‌ప్పు చేశాన‌ని వాపోయారు. సో.. సోష‌ల్ మీడియాలో తెలిసిన వాళ్లు పంపారంటూ ఏది ప‌డితే దాన్ని షేర్ చేయ‌కుండా ఉండ‌టం మంచిది. డిగ్గీ హ‌డావుడితో పోలిస్తే.. కేటీఆర్ కూల్ ను ఫాలో అయితే బెట‌ర్.