Begin typing your search above and press return to search.

బీజేపీ మార్క్ సినిమా..... అమిత్ షాతో బాలీవుడ్ టాప్ డైరెక్టర్

By:  Tupaki Desk   |   5 Sep 2022 8:36 AM GMT
బీజేపీ మార్క్  సినిమా..... అమిత్ షాతో బాలీవుడ్ టాప్ డైరెక్టర్
X
సినిమా పవర్ ఫుల్ మాధ్యమం. ఆ సంగతి అందరికీ తెలుసు. దాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ విషయం తెలుగు నాట తమిళనాట ఏనాడో రుజువు అయింది. ఇన్నాళ్ళకు దేశాన్ని ఏలే కమలానికి ఫిల్మ్ ఇండస్ట్రీ శక్తియుక్తుల మీద ఆసక్తి అనురక్తి కలగడం విశేషంగా చెప్పుకోవాలి. మరో రెండేళ్ళలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి హ్యాట్రిక్ ప్రధానిగా ప్రమాణం చేయాలని నరేంద్ర మోడీ భావిస్తున్నారు. ఆయన్ని అత్యున్నత పీఠం మీద మూడవసారి కూర్చోబెట్టి దేశమంతా కాషాయమయం చేయాలని అమిత్ షా గట్టి పట్టుదల మీద ఉన్నారు. దాంతో ఆయన ఎప్పటికపుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. దాని కోసం ఆయన ఈసారి పవర్ ఫుల్ మీడియా సహకారాన్ని తీసుకుంటున్నారు.

దేశంలోని బలమైన మీడియా టైకూన్ గా ఉన్న తెలుగు దిగ్గజం రామోజీరావుని కలవడం అందులో భాగం. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ గా ఉన్న జూనియర్ ఎన్టీయార్ తో అమిత్ షా భేటీ వేయడం ఆషామాషీగా జరిగిన వ్యవహారం కానే కాదని అంటారు. జూనియర్ పాన్ ఇండియా స్టార్ గా ట్రిపుల్ ఆర్ తో నిరూపించుకున్నారు. వరసబెట్టి సినిమాలు కూడా ఆయనవి అదే లైన్ లో ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ లో జూనియర్ నటనకు ఉత్తరాది ఫిదా అయింది.

దాంతో జూనియర్ ని ఎన్నో రకాలుగా వాడుకోవాలన్నదే బీజేపీ ఎత్తుగడగా అర్ధమవుతోంది. అలాగే మరో టాలీవుడ్ హీరో నితిన్ తో కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యారు. మరింతమంది టాలీవుడ్ నటులను కూడా ఫ్యూచర్ లో బీజేపీ పెద్దలు కలిసే ఆలోచన ఉంది అంటున్నారు.

ఇదిలా ఉంటే సడెన్ గా బాలీవుడ్ కి చెందిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రోహిత్ షెట్టి అమిత్ షాతో భేటీ కావడం సంచలనం అవుతోంది. ఊరకే ఈ భేటీలు జరగవని అని అందరికీ తెలుసు. ఈ భేటీలో అనేక రకాలైన అంశాలు ఇద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ మీద తన కన్నేసి కమలం ఇపుడు ఆ దిశగా ప్రముఖ దర్శకులు హీరోలతో పాటు కీలక మైన వారిని తిప్పుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.

అందులో భాగంగానే రోహిత్ షెట్టి భేటీ జరిగింది అని అంటున్నారు. ఇక రోహిత్ షెట్టి చాలా సక్సెస్ ఫుల్ సినిమాలు తీశారు. ఆయన ఆ మధ్యన షారుఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ అంటి సూపర్ హిట్ మూవీ తీశారు. అలాగే మరో టాప్ హీరో అక్షయ్ కుమార్‌తో సూర్యవంశ్ మూవీని, అజయ్ దేవ్‌గణ్‌తో సింగం అనన్ మూవీని తీసి హిట్లు కొట్టారు. ఇక రణ్‌వీర్ సింగ్‌తో సింబా వంటి పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ హీరోగా సర్కస్ అనే మూవీని ఆయన తీస్తున్నారు.

ఆయనకు పాన్ ఇండియా మూవీ డైరెక్టర్ గా పేరుంది. అమిత్ షా తాజాగా ముంబై రావడం, బాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో మీట్ కావడం అంటే ఏదో విశేషం ఉండి ఉంటుంది అని అంతా అంటున్నారు. దీని వెనక బీజేపీకి చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఆ ప్రభుత్వంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. వాటన్నిటి మీద జాతీయ స్థాయిలో ప్రచారం తీసుకువచ్చేందుకే ఒక పాన్ ఇండియా హీరో, మరో పాన్ ఇండియా డైరెక్టర్లతో తక్కువ టైమ్ లోనే అమిత్ షా భేటీలు వేశారు అని అంటున్నారు.

అంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి ఈ తరహా ప్రాజెక్టులతోనే జనాల్లోకి వెళ్తుందని తెలుస్తోంది. అలాగే దేశమంతా పేరున్న మీడియా టైకూన్లకు తమ వైపునకు తిప్పుకోవడం ద్వారా న్యూస్ మీడియాలో సానుకూల వార్తలను కూడా వచ్చేలా చూసుకుంటున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఫిల్మ్ ఇండస్ట్రీ ని తమ వైపునకు తిప్పుకుని దేశమంతా కమలకాంతులు సెల్యూలాయిడ్ ద్వారా వెదజల్లాలని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి హీరోలను పట్టి డైరెక్టర్లు పెట్టి బీజేపీ చూపించే సినిమా ఏంటో అన్నది త్వరలోనే చూడాలి. మరి ఆ సినిమా ఎపుడు విడుదల అవుతుంది అన్నది కమలనాధులే చెప్పాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.