Begin typing your search above and press return to search.

చివరి గంటలో ఐటీ రిటర్న్ ఫైల్ చేసినోళ్లు ఎందరో తెలుసా?

By:  Tupaki Desk   |   1 Aug 2022 1:57 PM GMT
చివరి గంటలో ఐటీ రిటర్న్ ఫైల్ చేసినోళ్లు ఎందరో తెలుసా?
X
వేతన జీవులతో పాటు.. పలువురు ప్రతి ఏడాది ఫైల్ చేయాల్సిన ఐటీ రిటర్న్ లకు సంబంధించిన తుది గడువు ఆదివారం అర్థరాత్రి 12 గంటలకు ముగియటం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరానికి (2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు) సంబంధించిన ఐటీఆర్ ను దాఖలు చేయటానికి గడువును మరింత పొడిగించాలని కోరటం.. అందుకు కేంద్రం ససేమిరా అనటం తెలిసిందే. కరోనా వేళ.. తుది గడువును పలుమార్లు పొడిగించిన నేపథ్యంలో.. ఈసారి అలాంటి అవకాశం ఉంటుందని భావించారు. కానీ.. అలాందేమీ జరగలేదు.

ఇక.. ఆదివారం ఒక్కరోజులో అర్థరాత్రి 11 గంటల నాటికి మొత్తం 67.97 లక్షల మంది ఐటీ రిటర్న్ లు దాఖలు చేయగా.. చివరి గంటలో మాత్రం ఏకంగా 4.5 లక్షల మంది ఐటీఆర్ దాఖలు చేయటం విశేషం. దీంతో మొత్తం గత ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ దాఖలు చేసిన వారి సంఖ్య 5.5 కోట్లకు చేరుకుందని చెబుతున్నారు.

ఇక.. గడువు లోపు ఐటీఆర్ దాఖలు చేయకుండా జరిమానా మాత్రమే ఉంటుందని చాలా మంది భావిస్తున్నారని.. కానీ అది తప్పని చెబుతున్నారు. ఫైన్ తో పాటు పలు ప్రయోజనాలు పొందే వీలు ఉండదని చెబుతున్నారు. జులై 31 లోపు ఫైల్ చేసే విషయంలో ఫెయిల్ అయిన వారు డిసెంబరు 31 లోపు ఫైల్ చేసే వీలుంది. కాకుంటే కొంత పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. డెడ్ లైన్ తర్వాత ఐటీ రిటర్న్ దాఖలు చేయకుంటే కోల్పోయే ప్రయోజనాల విషయానికి వస్తే.. చాలానే ఉన్నాయని చెబుతున్నారు.

ముఖ్యంగా వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే ఎక్కువగా ఉన్న వారు రూ.5వేలు.. అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారు రూ.వెయ్యి చొప్పున ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఏమైనా బకాయిలు ఉండి ఉంటే.. ఐటీఆర్ ఫైలింగ్ చేయటానికి డెడ్ లైన్ నుంచి ఒక శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఐటీ రిటర్ను సకాలంలో దాఖలు చేసి.. దాన్ని ధ్రువీకరించాకే రీఫండ్ వస్తుందన్న సంగతి తెలిసిందే.

అయితే.. ఫైలింగ్ ఆలస్యంగా చేసిన వారికి రీఫండ్ కూడా ఆలస్యమవుతుంది. ఐటీఆర్ లేట్ గా ఫైల్ చేసిన వారికి.. క్యాపిటల్ గైన్స్ వంటి వాటిని నష్టాలతో భర్తీ చేసుకునే వీలుండదు. వీటన్నింటితో పాటు డిసెంబరు 31, 2022 లోపు ఐటీఆర్ దాఖలు చేయకుంటే ఐటీ శాఖ నుంచి నోటీసులతో పాటు.. ఫ్యూచర్ లో మరిన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు. సో.. ఐటీఆర్ దాఖలు చేయటంలో ఆలస్యమైతే ఇప్పటికైనా పెనాల్టీ కట్టేసి పూర్తి చేయటం మంచిదన్న విషయాన్ని మర్చిపోవద్దు.