Begin typing your search above and press return to search.

నాటి తాలిబన్ల క్రూర పాలన.. ఎలా ఉంటుందో తెలుసా?

By:  Tupaki Desk   |   16 Aug 2021 11:30 PM GMT
నాటి తాలిబన్ల క్రూర పాలన.. ఎలా ఉంటుందో తెలుసా?
X
యువత జీన్స్, టీషర్ట్స్ విడిచేస్తున్నారు.. యూనివర్సిటీ విద్యార్థులు తమ కళాశాలలకు వీడ్కోలు చెబుతున్నారు.. బ్యూటీ ఫార్లర్లు తమ గోడలకు తెల్లని రంగు పూస్తున్నారు.. మహిళలు ఇంటిలోపలికి వెళుతున్నారు.. అవకాశం ఉన్నవారు ఎయిర్ పోర్టు వైపు వెళుతున్నారు.. ఇదంతా సినిమాలోని సీన్స్ కాదు.. అప్ఘనిస్తాన్ లో జరుగుతున్న యథార్థ పరిస్థితి.

తాలిబన్లు దేశాన్ని అక్రమించడంతో సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలివి. ప్రాణాలు అరచేతిలో బిక్కుబిక్కుమంటూ.. ఎటూ పోలేక.. ఏం చేయలేక గడుపుతున్నారు అప్ఘాన్ వాసులు. తాలిబన్ల రాకతో ఇన్నాళ్లు ఆనందంగా ఉన్న వారి జీవితం ఇప్పుడు చీకటిమయంగా మారింది. కొందరు బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.

అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ కు తాలిబన్లు చేరడంతో అక్కడి పరిస్థితులు భయానకంగా మారాయి. అంతకుముందు తాలిబన్ల పాలన గుర్తుకు తెచ్చుకొని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాస్వామ్యానికి తావు లేకుండా తాలిబన్లు చేసే క్రూరాలు మరోసారి ఉంటాయని తలుచుకొని భయాందోళన చెందుతున్నారు. రెండు దశాబ్దాల కింద తాలిబన్లు పాలించిన తీరు చూస్తే వెన్నులో వణుకు పుడుతుంది. వారు అమలు చేసే కఠిన చట్టాలను చూస్తే నిద్రపట్టదు. మరోసారి ఎక్కడ అలాంటి నిబంధనలు పెడుతారోనని టెన్షన్ కు గురవుతున్నారు.

10 ఏళ్లు దాటిన అమ్మాయిలు స్కూలుకు వెళ్లొద్దు.. మొగాళ్లు గెడ్డం గీసుకోవద్దు.. టీవీ చూడద్దు.. సినిమా జోలికి వెళ్లొద్దు.. సంగీతం అసలే వినొద్దు.. ఇలాంటి కఠిన నిబంధనలు తాలిబన్ల పాలనలో ఉంటాయి. వారికి నచ్చిందే చేయడం తప్ప ప్రజాస్వామమ్యం గురించి ఆలోచించడం ఉండదు. అయితే ఈసారి తాము ప్రజలను హింసించమని చెబుతున్నా.. ప్రజలకు నమ్మశక్యం కలగడం లేదు. ఎంత వారు చెప్పినా ప్రజల్లో మాత్రం ఏదో తెలియని భయాందోళన. ఎక్కడ తాము తుపాకుల గుండ్లకు బలవుతామోనని ఒకటే టెన్షన్. ఒకవేళ తాలిబన్ల ఆదేశాలను ధిక్కరిస్తే ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాలు తీసేయడమే.

1996- 2001 మధ్య తాలిబ్లన ఆగడాలు అంతా ఇంతా కాదు. అప్పటి పరిస్థితులను గుర్తుచేసుకుంటున్న కొందరు ఇప్పుడు వణికిపోతున్నారు. ఇక ఇన్నాళ్లు ప్రభుత్వానికి మద్దుతు ఇచ్చిన వారు తమ ప్రాణాలు ఎక్కడ పోతాయోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పాఠశాలలను ఆక్రమించేశారు. వాటిని నడపొద్దని ఆదేశాలు జారీ చేశారు.

మలిస్థాన్ జిల్లాలలో ఇంటింటికి వెళ్లిన ఘజనీ.. అక్కడి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారి వివరాలను సేకరిస్తున్నారు. హజరా మైనార్టీలు తాలిబన్ల రాకతో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే వీరు తాలిబన్ల ఆదేశాలను ధిక్కరించి పలు రంగాల్లో అభివృద్ధి సాధించారు. ఎక్కడ తమను చంపేస్తారోనని సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు.

తాలిబన్ల రాకతో ప్రజాస్వామ్యం ఇక లేనట్లేనని భావిస్తున్నారు. ఇప్పటికే విదేశీ రాయబార కార్యాలయాలన్నీ ఖాళీ అయ్యాయి. అవకాశం ఉన్న కొందరు ఎయిర్ పోర్టు వైపు పరుగులు తీస్తున్నారు. పాఠశాలలను ఆక్రమించడంతో 12 ఏళ్లు దాటిన బాలికలను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వడం లేదు. మహిళలు బురఖా తప్పని సరిగా వేసుకొని బయటకు వస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో ఇన్నాళ్లు చేసిన అభివృద్ధి ఇక కుంటుపడే అవకాశం ఉంది.

ఇప్పటికే పోలీసులు, అధికారులు ఆయాన ప్రాంతాలను విడిచి వెళ్లారు. కొందరు తాలిబన్లకు మద్దతునిస్తూ వారి ఆధీనంలో ఉండిపోతున్నారు. మరి కొందరు గుట్టు చప్పుడు కాకుండా దూర ప్రదేశాలకు వెళుతున్నారు. దేశ రాజధాని కాబుల్ నిర్మానుష్యంగా మారింది. ఎక్కడ చూసినా నల్లని, తెల్లని గుడ్డలు కట్టుకున్నవారే కనిపిస్తున్నారు. ఎక్కడ తమ ప్రాణాలు పోతాయోనని భయం భయంతో గడుపుతున్నారు. ఎవరికి ఎవరు సాయం చేసే పరిస్థితి లేకపోవడంతో దేవుడిపై భారం వేశాలు అప్ఘాన్ ప్రజలు. మరి తాలిబన్లు రాను రాను ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడుతారో చూడాలి..