Begin typing your search above and press return to search.

కేంద్రం అప్పులు ఎంతో తెలుసా ?

By:  Tupaki Desk   |   26 July 2022 5:18 AM GMT
కేంద్రం అప్పులు ఎంతో తెలుసా ?
X
అప్పులు చేయటంలో రాష్ట్రాలకు బుద్ధులు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎంత అప్పుచేసిందో తెలుసా ? తాజా లెక్కల ప్రకారం అక్షరాల రూ. 155 లక్షల కోట్లు. గడచిన ఐదేళ్ళల్లో అంటే 2018-19 నుండి 2022-23 ఆర్ధిక సంవత్సరం వరకు లెక్కలు తీసుకుంటే సుమారు రూ. 63 లక్షల కోట్లు అప్పులు పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ప్రకటించారు. 2018-19 నాటికి ఉన్న అప్పు రు. 92.50 లక్షల కోట్లు అయితే తాజా లెక్కల ప్రకారం 155 లక్షల కోట్ట రూపాయలకు పెరిగింది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం అప్పులు జీడీపీలో 9 శాతం పెరిగిందని కేంద్రమంత్రి చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి, ప్రభుత్వ ఆర్ధిక అంచనాలు భారీగా తప్పడం, జీడీపీ తగ్గుముఖం పట్టడయే అప్పులు భారీగా పెరగటానికి ప్రధాన కారణంగా చెప్పారు.

కోవిడ్ కారణంగా ఆదాయాలు పడిపోయినప్పటికీ ప్రజల జీవితాలను, జీవనోపాధిని రక్షించటానికి గతంలో ఎప్పుడు లేనంతగా కేటాయింపులు చేయాల్సొచ్చిందని పంకజ్ చెప్పారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే తాను మితిమీరి అప్పులు చేస్తు అందుకు కారణాలను చూపిస్తోంది కేంద్రప్రభుత్వం. ఇదంతా బాగానే ఉంది మరి అప్పులు చేసినందుకు కేంద్రం ఏవైతే కారణాలను చూపుతోందో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవే కారణాలను చూపుతున్నపుడు మరి వాటినెందుకు అంగీకరించటంలేదు.

కరోనా వైరస్ కారణంగా రాష్ట్రాలకు కూడా ఆదాయం తగ్గిపోయిన మాట వాస్తవం కాదా. ఒకవైపు ఆదాయాలు తగ్గిపోయినా కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భారీగానే ఖర్చులు చేశాయికదా.

కేంద్రం చేసే ఖర్చులు చేసినా రాష్ట్రాలు కూడా జనాలను ఆదుకోవటానికి భారీగానే ఖర్చుచేయాల్సొచ్చింది. రాష్ట్రాలు చేసే ఖర్చులను నియంత్రించేందుకు కేంద్రం పెద్దన్నపాత్ర పోషిస్తోంది బాగానే ఉంది. మరి కేంద్రప్రభుత్వం చేస్తున్న అప్పులను ఎవరు నియంత్రించాలి. అప్పులు రాష్ట్రాలు చేసినా కేంద్రంచేసినా అంతిమంగా తీర్చాల్సింది చివరకు జనాలే అన్న విషయం అందరికీ తెలుసు.