Begin typing your search above and press return to search.

బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్ కు మద్దతట?

By:  Tupaki Desk   |   20 Aug 2022 10:38 AM GMT
బీజేపీని ఓడించేందుకే టీఆర్ఎస్ కు మద్దతట?
X
మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ సిట్టింగ్ సీటు అయిన దీన్ని చేజిక్కించుకునేందుకు ప్రధానంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ పోటీపడుతున్నాయి. మధ్యలో కాంగ్రెస్ కూడా తండ్లాడుతోంది. ఈ క్రమంలోనే అక్కడి చిన్నా చితక పార్టీలు, నేతలను లాగే పనిలో మిగతా పార్టీలన్నీ కాచుకూర్చున్నాయి.

నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులకు బలం బాగానే ఉంది. అందుకే సీపీఐకి గాలం వేశారు కేసీఆర్.నిన్న రాత్రి 2 గంటలకు సీక్రెట్ గా సీపీఐ నేతలతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. సీపీఐ నేతలు చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకట్ రెడ్డిలు స్వయంగా సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని సీఎం వారిని కోరారు. బీజేపీని ఓడించేందుకు కలిసి రావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని సీపీఐ నేతలు హామీ ఇచ్చారు. సీఎంతో చర్చించిన అంశాలపై కార్యదర్శి వర్గంతో నేతలు ఇవాళ ఉదయం 10.30 గంటలకు సమీక్షించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశంలో సీపీఐ నేతలు అధికారికంగా ప్రకటించనున్నారు.మరోవైపు మునుగోడు సభకు రావాలని సీపీఐ నేతలను సీఎం కోరగా.. సభలో పాల్గొనేందుకు సీపీఐ అంగీకరించింది. టీఆర్ఎస్ మునుగోడు సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి పాల్గొననున్నారు.

మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకూడదన్న ఆలోచనలో సీపీఐ-సీపీఎంలు ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. కాబట్టి కాంగ్రెస్ ఓట్లు రెండుగా చీలడం ఖాయమని.. ఒకవేళ కాంగ్రెస్ కు వామపక్షాలు మద్దతు ఇచ్చినా బీజేపీనే లాభపడుతుందని విశ్లేషిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీని ఎదుర్కొనే టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం కొంత మంచిదని సీపీఐ నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చే అంశం కేవలం మునుగోడుకే పరిమితం కాబోదని.. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తో కలిసి నడుస్తామని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఆయన మీడియా ముఖంగా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. బీజేపీని ఓడించే పార్టీ ఏది ఉంటే దానికే తమ మద్దతు అని సీపీఐ చాడా అన్నారు. ఉప ఎన్నికల్లో సీపీఐ నిలబడే పరిస్థితి లేదన్నారు. బీజేపీని ఓడించే సత్తా ఒక్క టీఆర్ఎస్ కే ఉందని.. అందుకే ఆ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ఇది మునుగోడుకు పరిమితం కాదని.. భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామన్నారు.

అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని.. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా జాతీయ పార్టీ తీర్మానం ఉందన్న విషయాన్ని చాడ గుర్తు చేశారు.

2018 ఎన్నికల్లతో తమతో పొత్తు పెట్టుకొని మరీ ఇచ్చి మూడు సీట్లలో కాంగ్రెస్ పోటీ చేసింది. ఉత్తమ్ కుమార్ ఇబ్బంది పెట్టారని.. అందుకే కాంగ్రెస్ తో కలిసేది లేదని సీపీఐ చాడ వెంకటరెడ్డి అన్నారు. అందుకే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం లేదన్నారు.