Begin typing your search above and press return to search.

ఇంతకీ కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందా? లేచిందా?

By:  Tupaki Desk   |   14 Nov 2019 6:06 AM GMT
ఇంతకీ కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందా? లేచిందా?
X
కొంత మంది టచ్ లో ఉన్నారంటోంది బీజేపీ.. మొన్ననే హుజూర్ నగర్ లో కొట్టిన దెబ్బ గుర్తులేదా అంటోంది టీఆర్ఎస్. ఇలా తెలంగాణ రాజకీయ తెరపై ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ మౌనంగా ఉంటుండగా.. అస్సలు బలం లేని బీజేపీ మాత్రం తొడ గొడుతోంది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ హాట్ కామెంట్ చేశారు. కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని బాంబు పేల్చారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీని కాదని ఇక్కడ ప్రతిపక్షంలో అదీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీలో చేరడానికి నేతలు ఉబలాటపడుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు... హుజూర్ నగర్ లో డిపాజిట్ గల్లంతైన పార్టీలో చేరడానికి గులాబీ ఎమ్మెల్యేలు క్యూ కట్టేంత సీన్ ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీ బలం. కానీ మొన్నటి హుజూర్ నగర్ లో స్వతంత్ర అభ్యర్థి కంటే కూడా తక్కువ ఓట్లు వచ్చి డిపాజిట్ గల్లంతైన బీజేపీ తీరు చూశాక టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాదు.. ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరడానికి తటపటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తోందన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం ‘తమతో గులాబీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు’ అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ లక్ష్మణ్, కిషన్ రెడ్డి, ప్రభాకర్, చింతల రాంచంద్రారెడ్డి లాంటి ఉద్దండులైన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం కేసీఆర్ చిత్తుగా ఓడించి పక్కనపెట్టారు. ప్రజల్లో కూడా బీజేపీపై సానుభూతి వ్యక్తం కావడం లేదు.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం కేసీఆర్ గ్రాఫ్ పడిపోయిందని.. ఇక టీఆర్ఎస్ పని అయిపోయిందని.. వచ్చేసారి మాదే అధికారం అన్న మాటలను మాత్రం ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఒప్పుకునే పరిస్థితి అయితే కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది.