Begin typing your search above and press return to search.

చనిపోయిన భర్తపై కేసు

By:  Tupaki Desk   |   16 Oct 2015 3:50 PM IST
చనిపోయిన భర్తపై కేసు
X
గృహ హింస చట్టం మహిళలకు ఎంతగా ఉపయోగపడుతుందో... వారి చేతుల్లోనే అంతగా అపహాస్యం పాలవుతోంది కూడా. అంతేకాదు, దాన్ని అడ్డంపెట్టుకుని భర్తను, అత్తమామలను అకారణంగానే ముప్పతిప్పలు పెడుతున్న మహిళలూ ఉంటున్నారు. అలాంటివారి కారణంగా భారతీయ శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్‌ దుర్వినియోగం అవుతోంది. ఉత్తరప్రదేశ్‌ లోని గురుగావ్ కు చెందిన ఓ మహిళ ఈ సెక్షన్ దుర్వినియోగంలో ఏకంగా కొత్త కోణాన్ని చూపించింది. భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయిన తరువాత కూడా భర్తతోపాటు, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసును దాఖలు చేసింది.

గుర్ గావ్ లో బ్యాంకు ఉద్యోగం చేస్తున్న రాకేశ్ పిలానియా అనే 30 ఏళ్ల వ్యక్తి ఇటీవల అపార్ట్‌ మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే... ఆ మరుసటి రోజునే ఆయన భార్య అతనిపై కేసు పెట్టింది. భర్తతో పాటు అత్తమామలు తనను వేధిస్తున్నారని అందులో పేర్కొంది.

అయితే... భర్త ఆత్మహత్యకు కారకురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె తనకు ఇబ్బంది రాకుండా ముందుగా ఈ కేసు పెట్టినట్లు తెలుస్తోంది. భర్త ఆత్మహత్యకు కారకురాలిగా భావించి ఆమెను అరెస్టు చేయకుండా, కేసు పెట్టకుండా ఉండేందుకే ఆమె ఈ వరకట్నం కేసును దాఖలు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కేసులో రాకేశ్ చనిపోయినందున ఆయన్ని కేసు నుంచి తప్పిస్తారని, అయితే బంధువులపై మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది. కాగా పది లక్షల రూపాయలు కావాలని వేధిస్తున్నట్టు కేసు పెడతానంటూ మమ్మల్ని, కొడుకును కోడలు తరచుగా బెదిరించేదని... ఆ బెదిరింపులు, వేధింపులను తట్టుకోలేకే కొడుకు చనిపోయాడని రాకేశ్ తండ్రి చెబుతున్నారు. 498ఏ సెక్షన్ దుర్వినియోగంపై డాక్యుమెంటరీ తీస్తున్న ఫిల్మ్‌మేకర్, జర్నలిస్ట్ దీపక్ భరద్వాజ్ ఈ కేసు స్టడీని కూడా తన డాక్యుమెంటరీలో చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఇది వెల్లడైంది.