Begin typing your search above and press return to search.

చైనాలో భీ'కరువు'.. మేఘ మథనం మందు

By:  Tupaki Desk   |   19 Aug 2022 11:30 PM GMT
చైనాలో భీకరువు.. మేఘ మథనం మందు
X
చైనా అంటే ఏదైనా ఆర్టిఫీషియల్ గా చేయగలదు.. చంద్రుడైనా.. సూర్యుడైనా సరే. పక్క దేశాలను ఆక్రమించినా.. వాటికి పప్పుబెల్లాలు పెట్టి దారిలోకి తెచ్చుకున్నా దానికే చెల్లు. అందుకే చైనా అంటే మిగతా దేశాలకు అంత మంట. మనతో పాటే ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. చైనా చాలా ముందుకెళ్లింది. ఇక పారిశ్రామికంగా జర్మనీ, జపాన్ లను దాటేసింది. అయితే, అలాంటి చైనాకు వాతావరణం కొరుకుడు పడడం లేదు. కొంత కాలంగా ఆ దేశంలో వర్షాలు లేవు. దీంతో కరువు తీవ్రం అవుతోంది.

మొన్న యూరప్.. నేడు ఇక్కడ.. మొన్నటివరకు యూరప్ ను హీట్ వేవ్ వణికించింది. జర్మనీ నుంచి ఇంగ్లండ్ వరకు జనం ఉక్కపోతతో అల్లాడారు. ఇప్పుడా ఆ వేవ్ చైనాకు సెగ పుట్టిస్తోంది. 262 వెదర్‌స్టేషన్లలో 40 డిగ్రీలకు పైగా రికార్డు అవుతుండగా.. 8 చోట్ల 44 డిగ్రీలను దాటేసింది. హీట్ వేవ్ కారణంగా చైనాలో కరువు తీవ్రమైంది. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. నదుల్లో నీటి మట్టం పడిపోతోంది. జనమేమో ఫ్యాన్లు, ఏసీలు వేసేసుకుని కరెంటును కాల్చేస్తున్నారు. ఇక జలవిద్యుదుత్పత్తి లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి. వ్యాపార సముదాయాలను బంద్ పెడుతున్నారు. కరెంటు కోతలతో కటకటలాడుతున్నారు.ఇప్పటికే రెండున్నరేళ్లుగా జీరో కొవిడ్ పాలసీతో దెబ్బతిన్న చైనాకు ఇది మరింత చేటు చేస్తోంది.

61 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా.. నది కూడా ఎండిపోయి..చైనాలో ప్రస్తుతం గత 61 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండుతున్నాయి. రెండు నెలలుగా అయితే.. రోడ్డుపై గుడ్డు పోస్తే ఆమ్లెట్ అవుతోంది. మరో వారం రోజులు వాతావరణం ఇంతే ఉండనుంది. యాంగ్జీ నదిని చైనాలో అతి పెద్దదిగా పేర్కొంటారు. అలాంటిదాంట్లోనూ నీటి మట్టం ఎన్నడూ లేనంతగా పడిపోయింది. చాలా వరకు ఎండిపోయింది. ఎండలు 61 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉంటే.. వర్షాలు 60 ఏళ్లలో ఎన్నడూ కురవనంత తక్కువ స్థాయిలో పడ్డాయి.

సిచువాన్.. చిక్కుకుపోయి..సిచువాన్.. నైరుతి చైనాలో ఉంటుంది. ఆ దేశంలో మూడో అతిపెద్ద ప్రావిన్సు. ప్రస్తుత భీకరువు ప్రభావం ఆ ప్రావిన్స్ పై తీవ్రంగా ఉంది. ఇక్కడి 51 చిన్న నదులు, 24 జలాశయాలు ఎండిపోయాయి. అంతేగాదు.. సిచువాన్ ప్రత్యేకత ఏమంటే ఏడేళ్లుగా జల విద్యుత్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. ఎంతగా అంటే 80 శాతం జల విద్యుత్తే. ఇప్పుడు వర్షభావంతో ప్రావిన్స్‌లోని హైడ్రోపవర్‌ ప్లాంట్ల ఉత్పత్తి పడిపోయింది. చైనాలో బొగ్గు కొరత కారణంగా ఇప్పటికే విద్యుత్తు కోతలు కొనసాగుతున్నాయి. దీంతో గ్రిడ్‌ నుంచి విద్యుత్తు మళ్లింపు సాధ్యం కావడంలేదు. దాదాపు 54 లక్షల మంది జనాభా ఉన్న డైజూ నగరం కొన్నాళ్ల క్రితం తీవ్రమైన కరెంటు కోతను ఎదుర్కొంది. ముఖ్యంగా ఈ ప్రావిన్స్‌ రాజధాని చెంగ్డూలో సబ్‌వే స్టేషన్ల నిర్వహణ కోసం వీధిలైట్లను ఆపివేస్తున్నారు.

దీంతోపాటు డైజూ నగరంలో కూడా పొదుపు చర్యలు చేపట్టారు. ఈ ప్రావిన్స్‌లోని ఫ్యాక్టరీలు, షాపింగ్‌ మాల్స్‌, ఆఫీసులకు కరెంటును రేషన్‌ విధానంలో కేటాయిస్తున్నారు. విద్యత్తు ఎక్కువగా వినియోగించే ఫ్యాక్టరీలను తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు. ఫలితంగా టొయోటా, ఫాక్స్‌కాన్‌, చైనా బ్యాటరీల తయారీ సంస్థ కాంటెంపరరీ ఆంప్రెక్స్‌ టెక్నాలజీ సంస్థల కర్మాగారాలు నిలిచిపోయినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ కథనంలో వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 26 సెంటీగ్రేడ్‌కు తక్కువలో వాడకూడదని నిబంధన విధించింది.

చాలా నగరాల్లో రెడ్‌ అలర్ట్‌..అధిక ఉష్ణోగ్రతల కారణంగా 138 నగరాల్లో రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించారు. బుధవారం మరో 373 నగరాల్లో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. గురువారం దేశవ్యాప్తంగా ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. సోమవారంతో హీట్‌వేవ్‌ మొదలై 64 రోజులు దాటింది. ఈ కరవును తట్టుకోవడానికి మేఘమథనంపై దృష్టిపెట్టింది. చైనా విమానాలు సిగరెట్‌ అంతటి సిల్వర్‌ అయోడైడ్‌ రాడ్లను మేఘాల్లోకి వదులుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 1940 నుంచి క్లౌడ్‌ సీడింగ్‌ జరుగుతోంది. కాకపోతే చైనాలో ప్రస్తుతం భారీ ఎత్తున చేపడుతున్నారు. యాంగ్జీ పరీవాహక ప్రాంతంలో చాలాచోట్ల మేఘమథనం మొదలుపెట్టారు. మరోవైపు హుబే ప్రావిన్స్‌లోనూ క్లౌడ్‌ సీడింగ్‌ ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇక్కడ కూడా అర కోటి మంది కరవుతో ఇబ్బందులు పడుతున్నారు. లక్షన్నర మందికి తాగునీటి కొరత ఉండగా.. 4 లక్షల హెక్టార్ల పొలాలకు నీరు లేదు.