Begin typing your search above and press return to search.

రెస్టారెంట్‌ లో ఇక జీఎస్టీ షాక్ ఎదుర‌వ్వ‌దు

By:  Tupaki Desk   |   10 Nov 2017 6:05 PM GMT
రెస్టారెంట్‌ లో ఇక జీఎస్టీ షాక్ ఎదుర‌వ్వ‌దు
X
జీఎస్‌ టీతో బెంబేలెత్తిపోయిన భోజన ప్రియులకు శుభ‌వార్తం. రెస్టారెంట్లపై జీఎస్టీ రేటును తగ్గించారు. ఇక నుంచి హోటళ్లపై అయిదు శాతం జీఎస్టీ వసూల్ చేయనున్నారు. ఏసీ, నాన్ ఏసీ రెస్టారెంట్లు ఈ శ్లాబ్‌ లోకే వస్తాయని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు.గౌహ‌తిలో 23వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు. రెస్టారెంట్లకు ఐటీసీ బెనిఫిట్స్ ఏమీ ఉండవన్నారు. పాత రేట్ల మీద జీఎస్టీ వేయడం వల్ల కస్టమర్లకు అది భారంగా మారిందని జైట్లీ అన్నారు. అందుకే స‌వ‌రిస్తున్నామ‌ని తెలిపారు.

కాగా, ఇప్పటి వరకు రెస్టారెంట్లపై 18 శాతం జీఎస్టీ వసూల్‌ చేశారు. అయితే స్టార్‌ హోటళ్లకు మాత్రం పన్ను శ్లాబ్‌ మరోలా ఉంది. జీఎస్టీలో అత్యధిక పన్ను రేటు కలిగిన 28 శాతం శ్లాబులో ఇవాళ కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులను ఈనెల 15వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 28 శాతం శ్లాబ్ నుంచి 178 వస్తువులను తప్పించినట్లు ఆయన తెలిపారు. వాటిని 18 శాతం శ్లాబ్‌ లో చేర్చినట్లు వెల్లడించారు. 18 శాతం శ్లాబ్‌ లో ఉన్న 13 ఐటమ్స్‌ను 12 శాతానికి - మరో 5 ఐటమ్స్‌ను 18 నుంచి 5 శాతం శ్లాబ్‌లోకి మార్చినట్లు ఆయన తెలిపారు. 12 శాతం శ్లాబ్ నుంచి 5 శాతం శ్లాబ్‌ కు 8 ఐటమ్స్, 5 శాతం శ్లాబ్‌లో ఉన్న మరో ఆరు వస్తువులపై మొత్తానికే పన్ను ఎత్తివేసినట్లు జైట్లీ తెలిపారు.

కాగా, గత్యంతరం లేకే పన్ను రేట్ల తగ్గింపు చేశార‌ని కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించారు. జీఎస్టీపై పలు విమర్శలు రావడం, త్వరలో గుజరాత్‌ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, అందుకే గత్యంతరం లేక పలు వస్తువుల పన్ను రేట్లను తగ్గించిందని చిదంబరం తెలిపారు. ఈ మార్పులను తాము ముందే ఊహించామని చెప్పారు. జీఎస్టీ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరుగాలని, ఓటింగ్‌ చేపట్టాలని తాము డిమాండ్‌ చేస్తే బీజేపీ పారిపోయిందని, కానీ జీఎస్టీ కౌన్సిల్‌ నుంచి పారిపోయే అవకాశం లేదని తెలిపారు. పన్ను రేట్లను తగ్గించాలంటూ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. మ‌రోవైపు జీఎస్టీని సరైన దారిలో నడిపించడంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ విఫలమయ్యారని, ఆయన మనసు పెట్టి పనిచేయడం లేదని బీజేపీ సీనియర్‌ నాయకుడు యశ్వంత్‌ సిన్హా ఆరోపించారు. జీఎస్టీకి రోజూ మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని, ఆయన పని విధానానికి ఇవే నిదర్శనమని తెలిపారు. జైట్లీని ఆర్థికశాఖ నుంచి తొలిగించాలని డిమాండ్‌ చేశారు.