Begin typing your search above and press return to search.

మోడీ ప్రస్తావించిన వ్యాక్సిన్ వేస్టేజ్ పై ఈటెల కీలక వ్యాఖ్య

By:  Tupaki Desk   |   18 March 2021 4:30 AM GMT
మోడీ ప్రస్తావించిన వ్యాక్సిన్ వేస్టేజ్ పై ఈటెల కీలక వ్యాఖ్య
X
వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కొన్ని రాష్ట్రాలకు ఇబ్బందికరంగా మారాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. రెండు తెలుగు రాష్ట్రాల పరపతిని దెబ్బ తీసేలా ప్రధాని ప్రస్తావించిన అంశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ వేస్టేజ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ముందంజలో ఉందని చెప్పటం తెలిసిందే. ఈ విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో వ్యాక్సిన్ వేస్టేజ్ అధికంగా ఉందన్న మాట మాత్రమే కాదు.. గణాంకాల్ని సైతం ప్రధాని ఉటంకించారు.

ప్రధాని నేరుగా తెలంగాణ రాష్ట్రం పేరును ప్రస్తావించి.. వ్యాక్సిన్ వేస్టేజ్ 17 శాతానికి పైనే ఉందని చెప్పటం.. జాతీయ సగటు ఆరున్నర శాతానికి మించి చాలా ఎక్కువగా ఉందన్న మాటతో తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనిపై గంటల వ్యవధిలోనే మంత్రి ఈటెల రాజేందర్ స్పందించారు. ప్రధాని మోడీ చెప్పినట్లుగా తెలంగాణలో వ్యాక్సిన్ వేస్టేజ్ జరగటం లేదన్నారు. రాష్ట్రంలో పదిశాతానికిపైనే వ్యాక్సిన్ వేస్ట్ అవుతుందన్న మాటలో నిజం లేదన్నారు.

ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కువగా ఉందని.. టాప్ లో తెలంగాణ ఉన్నట్లుగా పేర్కొన్నారు. జాతీయ సగటు కంటే పదిశాతం ఎక్కువగా ఉండటాన్ని ప్రశ్నించి.. రాష్ట్ర ప్రభుత్వాలు వృధాను అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు తెలియజేసేలా ఉందన్న వ్యాఖ్య బలంగా వినిపిస్తోంది.

మోడీ వ్యాఖ్యతో రెండు తెలుగు రాష్ట్రాలు ఆత్మరక్షణలో పడ్డాయి. ఈ అంశంపై ఏపీ సర్కారు కామ్ గా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల మాత్రం అందుకు భిన్నంగా స్పందించి.. వేస్ట్ కావటం లేదన్న వ్యాఖ్యను చేశారు. ఈటెల మాటలకు కేంద్రం స్పందించి.. అధికారిక సమాచారం బయటపెడితే పరిస్థితి ఏమిటో ఆలోచించారా రాజేందర్ అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. లోపాన్ని ఎత్తి చూపినప్పుడు దాన్ని సరి చేసుకోవాలే కానీ.. ఇలా రియాక్టు కావటం సరిగా లేదన్న మాట వినిపిస్తోంది.