Begin typing your search above and press return to search.

అమిత్ షా లెక్కకు ఈటెల ‘లెక్క’

By:  Tupaki Desk   |   11 Jun 2016 2:33 PM GMT
అమిత్ షా లెక్కకు ఈటెల ‘లెక్క’
X
అనుకున్నదే అయింది.నల్గొండ జిల్లా సూర్యాపేటలో బీజేపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీ చీఫ్ అమిత్ షా ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రంలోని మోడీ సర్కారు చాలానే చేసిందని చెప్పటం తెలిసిందే. గడిచిన రెండేళ్ల వ్యవధిలోతెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం రూ.90వేల కోట్ల సాయం చేసిందన్న మాటను ఆయన చెప్పారు. అమిత్ షా లెక్కల గురించి తెలిసిన నేపథ్యంలో తెలంగాణ అధికారపక్షం ఈ మాటపై తీవ్రంగా రియాక్ట్ కావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమైంది. దీనికి తగ్గట్లే తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ లెక్కల చిట్టా విప్పారు.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చాలానే చేసిందని చెబుతున్న అమిత్ షా మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల.. గడిచిన రెండేళ్లలో మోడీ సర్కారు చేసిందేమీ లేదన్నారు. రూ.90వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి సాయం చేసిందన్న మాటల్లో నిజం లేదన్న ఆయన.. కేంద్రం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది కేవలం రూ.36వేల కోట్లేనని వ్యాఖ్యానించారు. ఇక.. మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు కేంద్రం చేసింది ఏమీ లేదని తేల్చేశారు. ఇక.. తెలంగాణ ఫైర్ బ్రాండ్ హరీశ్ మాట్లాడుతూ.. అమిత్ షాకు తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్టు విభజన జరిగేలా వ్యవహరించాలంటూ కౌంటర్ వేయటమే కాదు.. కేసీఆర్ సర్కారు గురించి ప్రధాని మోడీ పొగుడుతుంటే.. అమిత్ షా విమర్శలు చేయటం ఏమీ బాగోలేదంటూ చురకలు అంటించే ప్రయత్నం చేశారు. అనుకున్నట్లే అమిత్ షా లెక్కలకు ఆర్థికమంత్రి ఈటెల మొదలు కేసీఆర్ సర్కారులోని ముఖ్యనేతలంతా తమదైన లెక్కలు చెప్పారని చెప్పాలి.