Begin typing your search above and press return to search.

అధినేత చెప్పినా త‌మ్ముడు పాటించ‌డు !

By:  Tupaki Desk   |   18 Aug 2022 11:30 PM GMT
అధినేత చెప్పినా త‌మ్ముడు పాటించ‌డు !
X
పేద‌ల‌కు అన్నం పెడ‌తామ‌ని సంక‌ల్పించారు చంద్ర‌బాబు. పార్టీ నేతలందరూ తెలుగుదేశం పార్టీ అధినేతను ఫాలో అయ్యారు. కానీ శ్రీకాకుళంలో అది జరగడం లేదు. ఇక్కడి నేతలు ఎవరూ చెవికెక్కించుకోవడం లేదు.

ఇక్కడే కాదు రాష్ట్రంలో సగం నియోజకవర్గాల్లో ఈ పని ఇంకా జరగడం లేదు. దాంతో అన్నా క్యాంటీన్ల ఊసు కొన్ని జిల్లాల‌కే పరిమితం అయింది. అస్స‌లు జిల్లా కేంద్రంలో ఒక్క పూట కూడా ఈ అన్న‌దాన క్ర‌తువుకు శ్రీ‌కారం దిద్ద‌లేని స్థితిలో ఉన్నాయా ఇక్కడ సీనియర్ రాజకీయ కుటుంబాలు? కింజ‌రపు కుటుంబం, టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇంట్లోనే ఉన్నా...

బువ్వ పెట్టడం లేదు. మేమే గొప్ప అనుకునే గుండ కుటుంబాలు, కూన కుటుంబాలు పట్టించుకోలేదు. ముఖ్యంగా ఆరోజు చంద్ర‌బాబుపై అక్క‌సుతో అన్నా క్యాంటీన్ల‌ను జ‌గ‌న్ మూయించేరని, తాము ప‌ది మందికీ అన్నం పెట్టి వాటిని తిరిగి తెరుస్తామ‌ని, అధికారం ఉన్నా లేక‌పోయినా పేద‌ల ప‌క్షం వ‌హించి, వారి ఆక‌లి తీరుస్తామ‌ని అదే టీడీపీకి చెందిన రాజ‌మండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భ‌వాని చెప్పారు. ఆమె పుట్టింటి వారు పెద్దగా పట్టించుకోలేదు.

అలానే బాల‌య్య జీవ‌న స‌హ‌చ‌రి వ‌సుంధ‌ర నేతృత్వంలో కొంద‌రు ఎన్ఆర్ఐల సాయంతో హిందూపురం వాకిట కూడా అన్నా క్యాంటీన్లు ఆరంభమయ్యాయి. ఒకప్పటి టీడీపీ కంచుకోట కళ్యాణదుర్గంలో 1983 నుంచి టీడీపీలో ఉన్న ఉన్నం హనుమంతరాయచౌదరి కుటుంబం కూడా నిత్యం వెయ్యి మందికి భోజనాలు పెడుతోంది. ఇంకా మంగళగిరిలో లోకేష్ తోనే మొదలైన ఈ తంతు రాష్ట్రమంతా వ్యాపిస్తోంది. టీడీపీ ఏపీ అధ్యక్షుడి ఇంటిలో లేకపోతే ఎలా?

ఉత్తరాంధ్ర జిల్లాలో కోట్ల‌కు కోట్లు డ‌బ్బులున్న తెలుగు త‌మ్ముళ్లు రియ‌ల్ట‌ర్ల రూపంలో ఇప్ప‌టికీ వైసీపీతో బంధాలు కొన‌సాగిస్తూ (ఆరోపణలు) క్యాస్ట్ కార్డ్ పోలిటిక్స్ న‌డిపే వెల‌మ దొర‌లూ , కాళింగ భూ స్వాములు ఉన్నారు క‌దా ! మ‌రి ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌కూ ఎందుక‌ని ప‌ట్ట‌డం లేదు.

రూలింగ్ క‌మ్యూనిటీల‌కు ప‌ట్ట‌క‌పోతే మిగిలిన వాళ్లెలా వాటిని ప‌ట్టించుకుంటారు అని ! ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలో కాపు, కాళింగ, వెల‌మ వీటితో పాటు ఎస్టీ, ఎస్సీ ఉన్నాయి. అధినేత చంద్రబాబు చెప్పినా వీళ్ల‌కేం క‌ద‌లికా లేక‌పోతే రేప‌టి వేళ ఎన్నిక‌ల్లో ఏ విధంగా ల‌బ్ధి పొందాల‌ని భావిస్తున్నార‌ని?