Begin typing your search above and press return to search.

నిర్మలా సీతారామన్‌ కు అసలు ఏమైంది.. ఎయిమ్స్‌ ఏమంటోంది?

By:  Tupaki Desk   |   26 Dec 2022 12:50 PM GMT
నిర్మలా సీతారామన్‌ కు అసలు ఏమైంది.. ఎయిమ్స్‌ ఏమంటోంది?
X
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్‌ హాస్పిటల్‌లోని ప్రైవేటు వార్డులో చేరారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్‌ కు 63 ఏళ్లు. మధ్యాహ్నం అస్వస్థతగా అనిపించడంతో ఆమెను ఎయిమ్స్‌ కు తీసుకువెళ్లారు.

మంత్రి సీతారామన్‌కు ఉదర సంబంధిత ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు దీంతో అస్వస్థతకు గురి కావడంతో ఆమెను హాస్పిటల్‌ కు తరలించారని వార్తలు వచ్చాయి. అయితే ఏడాదికి రెండుసార్లు ఆమె రెగ్యులర్‌ గా హెల్త్‌ చెకప్‌ లు చేయించుకుంటారని.. అందులో భాగంగానే రెగ్యులర్‌ చెకప్‌ కోసం హాస్పిటల్‌ వచ్చినట్టు ఎయిమ్స్‌ ప్రకటించింది. సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వెల్లడించింది.

కాగా నిర్మలా సీతారామన్‌ కేంద్ర వార్షిక బడ్జెట్‌ రూపకల్పనలో ప్రస్తుతం తలమునకలై ఉన్నారు. నిర్మల 1959 ఆగస్ట్‌ 18న ఆమె తమిళనాడు తిరుచారాపల్లిలో జన్మించారు. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్‌ పూర్తి చేశారు. ఆమె భర్త టీవీ వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్‌. ఆయన గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మీడియా సలహాదారుగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్నారు.

తొలిరోజుల్లో ప్రైస్‌ వాటర్‌ హౌస్‌ కూపర్స్‌ అనే ఆడిటింగ్‌ సంస్థలో నిర్మలా సీతారామన్‌ సీనియర్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తించారు. అంతర్జాతీయ వార్తా సంస్థ బీబీసీలోనూ పనిచేయడం గమనార్హం. 2003 నుంచి 05 మధ్యకాలంలో జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా ఉన్నారు. 2010లో ఆమె భారతీయ జనతా పార్టీలో చేరి అధికార ప్రతినిధిగా బాధ్యతలను చేపట్టారు.

నిర్మలా సీతారామన్‌ గతంలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. తద్వారా రక్షణ శాఖను నిర్వహించిన తొలి మహిళా మంత్రిగా ఆమె రికార్డులకెక్కారు. 2019 నుంచి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022లో ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపీగా తిరిగి ఎన్నికయ్యారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.