Begin typing your search above and press return to search.

మోడీని ఎదురించిన 50మందిపై దేశద్రోహం

By:  Tupaki Desk   |   4 Oct 2019 11:22 AM GMT
మోడీని ఎదురించిన 50మందిపై దేశద్రోహం
X
బీజేపీ గద్దెనెక్కాక మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయన్నది వాస్తవం అని చాలా చోట్ల దాడులతో రుజువైంది. ఇక మూకదాడులకు లెక్కలేదు.. దళితులు, మైనార్టీల హత్యలు జరిగాయి. వీటిపై అప్పట్లో దేశంలోని 50 మంది వివిధ రంగాల్లోని నిష్ణాతులైన సెలబ్రెటీలు గొంతెత్తారు. ప్రధాని మోడీకి ఘాటుగా లేఖ రాశారు. దేశంలోని ప్రముఖులంతా కలిసి రాసిన లేఖ బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. వీరికి పోటీగా మరో 60 మంది ప్రముఖులు కూడా మోడీకి మద్దతుగా నిలిచి కౌంటర్ ఇచ్చారు.

మోడీ పాలనకు వ్యతిరేకంగా లేఖ రాసిన వారిలో ప్రముఖ మేధావులు రామచంద్ర గుహ, అపర్ణాసేన్, దర్శకుడు మణిరత్నం సహా అదూర్ గోపాల్ కృష్ణన్, అనురాగ్ కశ్యప్, శ్యాంబెనగల్, కొంకణ్ సేన్ శర్మ, సౌమిత్రా చటర్జీ, శుభ ముద్గల్ లాంటి హేమాహేమీలున్నారు.

అయితే వీరి లేఖ సృష్టించిన వేడి ఇంకా రగులుతూనే ఉంది. తాజాగా ఈ 50 మంది ప్రముఖులు మోడీకి లేఖ రాయడాన్ని జీర్ణించుకోలేని బీహార్ లోని ముజఫర్ నగర్ కు చెందిన సుధీర్ కుమార్ ఓజీ అనే వ్యక్తి వారిపై ముజఫర్ నగర్ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దేశ ప్రతిష్టను ఈ 50 మంది ప్రముఖులు మంటగలిపారని.. దేశ ప్రధాని మోడీ అద్భుత పనితీరును నాశనం చేసే విధంగా రాసినలేఖపై సంతకాలు చేశారని.. వీరిపై దేశద్రోహం కేసు పెట్టాలని పిటీషన్ వేశారు.

ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 20న ఉత్తర్వులు ఇవ్వగా.. సదర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దేశాన్ని ప్రభావితం చేస్తున్న 50 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు నమోదు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. మోడీపై గళమెత్తుతే దేశద్రోహులుగా పరిగణిస్తారా అని దుమారం రేగుతోంది. మోడీ హయాంలో అసహనం పెరిగిందని గళమెత్తిన వీరిపై ఈ దేశద్రోహం కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.