Begin typing your search above and press return to search.

త్వరగా వుహాన్ వెళ్లాలని ఉంది ..?

By:  Tupaki Desk   |   3 May 2020 12:00 AM IST
త్వరగా వుహాన్ వెళ్లాలని ఉంది ..?
X
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వ్యాధితో అతలాకుతలం అవుతుంది. చైనాలో వెలుగు చూసిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి దేశాన్ని ఇబ్బంది పెడుతుంది. మన దేశం కూడా కరోనా దెబ్బకి అల్లాడిపోతున్న విషయం తెలిసిందే. అయితే , భారత్‌లో తొలిసారి కరోనా సోకిన వ్యక్తి ఎవరా అన్న సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..? కరోనా రాగానే, ఆ వ్యక్తి ఎలా స్పందించారు. అసలు ఈ వైరస్‌ ఎలా సోకి ఉంటుంది అని ఆలోచించారా..? దేశంలో తొలి కరోనా కేసుగా నమోదైన వ్యక్తి పేరు ఉష రామ్‌మనోహర్‌.

కేరళలోని త్రిస్సూర్‌ కు చెందిన ఆమె, వైరస్ కు కేంద్రబిందువైన చైనా దేశం వుహాన్‌ లోని ఓ విశ్వవిద్యాలయంలో వైద్యవిద్యను అభ్యసిస్తున్నారు. సెమిస్టర్‌ సెలవులకోసం ఈ ఏడాది జనవరిలో ఇంటికి వచ్చిన ఆమెలో.. అదే నెల 27 నుంచి గొంతులో నొప్పి దగ్గు వంటి పలు కరోనా లక్షణాలు కనిపించాయి. వెంటనే స్థానిక వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆమెను ఆస్పత్రికి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వాటిలో ఆమెకు కరోనా పాజిటివ్‌ గా తేలడంతో.. భారత్‌లో తొలి కరోనా కేసుగా ఉష నమోదైంది. ఆ సమయంలో తనకు భయం వేయలేదని.. అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది కోలుకోవడంతో.. తాను కూడా దాన్నుంచి బయటపడతానని విశ్వసించానని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అయ్యింది. మూడు వారాల చికిత్స అనంతరం ఉషకు కరోనా నెగటివ్‌ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 20న ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కాగా.. కోలుకున్న వెంటనే, వుహాన్ ‌లోని తన విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న ఆన్‌ లైన్‌ క్లాసులకు ఇంటివద్ద నుంచే హాజరవడం ప్రారంభించానని ఉష తెలిపారు. ప్రపంచంలోనే వుహాన్‌ కరోనాకు కేంద్రబిందువైనప్పటికీ.. అక్కడికి వెళ్లేందుకు తనకెలాంటి భయమూ లేదని.. వీలైనంత త్వరగా మళ్లీ అక్కడికి వెళ్లాలని ఉందని ఆమె స్పష్టం చేయడం గమనార్హం.