Begin typing your search above and press return to search.

వైఎస్ ఆర్సీపీకి మరో ఐదు ఎమ్మెల్సీలు!

By:  Tupaki Desk   |   31 May 2019 12:22 PM GMT
వైఎస్ ఆర్సీపీకి మరో ఐదు ఎమ్మెల్సీలు!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోకి మరో ఐదు ఎమ్మెల్సీ పదవులు పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల్లో నెగ్గిన వారు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసే పరిస్థితి ఉండటం, ఎన్నికల ముందు రాజీనామాలతో ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా ఎమ్మెల్సీ పదవులు దక్కడం ఖాయం అయ్యింది.

తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన పయ్యావుల కేశవ్, కరణం బలరాంలు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినట్టే. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా నెగ్గిన ఆళ్ల నాని, కోలగట్ల వీరభద్రస్వామిలు కూడా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేసినట్టే.

వీరు మాత్రమే గాక ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేసి ఉన్నారు. ఆ పదవికి కూడా ఇప్పుడు ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇలా ఐదు ఎమ్మెల్సీ పదవులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనసభ కోటాలోని ఈ పదవులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే అవకాశాలున్నాయి.

ఎమ్మెల్యేల బలాబలాల రీత్యా చూసుకుంటే.. తెలుగుదేశం పార్టీ తన ఖాతాలోని ఎమ్మెల్సీ పదవులను తిరిగి నిలబెట్టుకునే అవకాశాలు లేవు. టీడీపీ ఈ సారి ఎన్నికల్లో కేవలం ఇరవై మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా పెద్దగా ఎవరికీ అవకాశాలు ఉండకపోవచ్చు.