Begin typing your search above and press return to search.

నలుగురు సీఎంలు గుడికి వస్తే సామాన్య భక్తులకు దర్శనం బంద్ చేసుడా?

By:  Tupaki Desk   |   18 Jan 2023 8:30 AM GMT
నలుగురు సీఎంలు గుడికి వస్తే సామాన్య భక్తులకు దర్శనం బంద్ చేసుడా?
X
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వేళ.. ఏపీలోని తిరుపతి క్షేత్రానికి తీసిపోని రీతిలో అప్పటి యాదగిరిగుట్టను యాదాద్రిగా మారుస్తూ.. గుడి స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిన వైనం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు కోసం వందల కోట్ల రూపాయిలు ఖర్చుచేసి.. భారీగా ఏర్పాట్లు చేయటం తెలిసిందే. అయితే.. ఈ ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నా.. వసతుల విషయంలో ఇప్పటికి విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. యాదాద్రి దేవస్థానానికి ఈ రోజున నలుగురు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవటమే కాదు.. తమ జాతీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో మిత్రులుగా అవతరించే రాజకీయ పక్షాలతో పాటు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు ఖమ్మం సభకు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా.. వారు ఖమ్మం సభకు వెళ్లటానికి ముందు.. యాదాద్రిలో స్వామివారి దర్శనం చేసుకునేలా ప్లాన్ చేశారు.

ఢిల్లీ.. పంజాబ్.. కేరళకు చెందిన ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, కేజ్రీవాల్ తో పాటు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. సీపీఐ డి. రాజా తదితరులు హాజరు కానున్నారు. యాదాద్రిలో స్వామి వారి దర్శనానికి ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు.. సీఎం కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. యాదాద్రికి నలుగురు ముఖ్యమంత్రులు వస్తున్న నేపథ్యంలో.. ఈ రోజు (బుధవారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వామి వారి దర్శనాల్నిబంద్ చేస్తున్నట్లుగా ఆలయ ఈవో వెల్లడించటం గమనార్హం. స్వామివారిని చూసేందుకు నలుగురు ముఖ్యమంత్రులు వస్తే మాత్రం.. అంతదానికే సామాన్య భక్తులకు స్వామివారి దర్శనాలను బంద్ చేసుడేందన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఇక్కడ మరో అంశాన్ని ప్రస్తావించాలి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దర్శనాలు.. ఆర్జిత పూజలు నిలిపివేస్తున్నట్లుగా ఆలయ ఈవో గీత వెల్లడించగా.. అధికారిక కార్యక్రమాన్నిచూస్తే మాత్రం ఉదయం 10.40 గంటలకు ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి కేసీఆర్ యాదాద్రికి చేరుకుంటారు.

అనంతరం వారు గంట పాటు అక్కడ ఉండి లక్ష్మీ నరసింహస్వామి దర్శనాన్ని చేసుకుంటారు. తిరిగి 11.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఖమ్మంకు వెళతారు. అంటే.. ముఖ్యమంత్రులువెళ్లిపోయిన తర్వాత కూడా దాదాపు రెండు గంటల పాటు స్వామివారికి దర్శనాల్ని బంద్ చేయించటం చూస్తే.. ఎంత ముఖ్యమంత్రులు అయితే మాత్రం మరీ ఇంతలానా? అన్న మాట వినిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.