Begin typing your search above and press return to search.

జూలై 15 నుంచి 18 ఏళ్లు పైబ‌డ్డ వారంద‌రికీ ఉచిత బూస్టర్ డోస్!

By:  Tupaki Desk   |   13 July 2022 12:52 PM GMT
జూలై 15 నుంచి 18 ఏళ్లు పైబ‌డ్డ వారంద‌రికీ ఉచిత బూస్టర్ డోస్!
X
కరోనా నియంత్ర‌ణ‌లో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే దేశ ప్ర‌జ‌లంద‌రికీ రెండు డోసుల కోవిడ్ టీకాను అందించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. మ‌న‌దేశంలో రోజుకు 20 వేల కోవిడ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో దేశంలో 18 ఏళ్లు పైబ‌డ్డ వారంద‌రికీ ఉచితంగా బూస్ట‌ర్ డోసు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జూలై 15 శుక్ర‌వారం నుంచి 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ ఈ ప్రికాషన్‌ డోసును ఉచితంగా అందించనున్నట్లు వెల్ల‌డించింది.

కాగా స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే జూలై 15 నుంచి 75 రోజుల పాటు 18- 59 ఏళ్లున్న వారందరికీ ఉచితంగా బూస్టర్‌ డోసు అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. అర్హులైనవారు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఈ బూస్టర డోసును పొందవచ్చని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు.

అధికారిక లెక్కల ప్రకారం దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌కు అర్హులైన వారిలో 96 శాతం మంది ఒకడోసు తీసుకున్నారు. మ‌రో 87 శాతం మంది రెండు డోసుల టీకా తీసుకున్నారు. ప్రికాషన్‌ డోసును మాత్రం 18 నుంచి 59 ఏళ్ల వయసు వారికి అది కూడా కేవలం ప్రైవేటు సెంటర్లలోనే పంపిణీ చేస్తున్నారు. కాగా దేశంలో 77 కోట్ల మంది 18-59 ఏళ్ల‌ వయసు వారు ఉన్నారు. అందులో కేవలం ఒక శాతం మాత్రమే ఇప్పటివరకు బూస్టర్ డోసును తీసుకున్నార‌ని అధికారిక లెక్క‌లు తెలుపుతున్నాయి.

మ‌రోవైపు 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు మాత్రం బూస్టర్‌ డోసును ఉచితంగా అందిస్తున్నారు. వీరి సంఖ్య 16 కోట్లు ఉండగా వారిలో 26 శాతం మాత్రమే మూడో డోసు తీసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఇటీవల కరోనా వ్యాక్సిన్‌ రెండు, మూడు డోసుల మధ్య వ్యవధిని తొమ్మిది నుంచి ఆరు నెలలకు తగ్గించారు.

ఐసీఎంఆర్‌, ఇతర అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల్లోపు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. బూస్టర్‌ డోస్‌ తీసుకుంటే ఇమ్యూనిటీ ప్రతిస్పందన మెరుగ్గా ఉంటుందని తేలిందని జాతీయ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తోన్న ఓ అధికారి వెల్లడించారు.