Begin typing your search above and press return to search.

అయోధ్య తీర్పు: కత్తులు కొని సిద్ధమవ్వండి!

By:  Tupaki Desk   |   21 Oct 2019 6:17 AM
అయోధ్య తీర్పు: కత్తులు కొని సిద్ధమవ్వండి!
X
అయోధ్య తీర్పు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ తీర్పుపై అప్పుడే హిందుత్వ - బీజేపీ నేతలు జడలు విప్పుతున్నారు. తీర్పు అనుకూలంగా రాగానే రామమందిర నిర్మాణం చేస్తామంటూ హీటెక్కించే మాటలు మాట్లాడుతూ వేడి పుట్టిస్తున్నారు..

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు - పలువురు ఆధ్యాత్మిక గురువులు - స్వాముల ఇప్పటికే అయోధ్య తీర్పు అనుకూలంగా వస్తుందనే ధీమాతో అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామంటూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకుడు గజరాజ్ రాణా దీపావళి నాడు బంగారం కొనకుండా కత్తులు కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం వివాదాస్పదమైంది. సుప్రీంలో అయోధ్య తీర్పును బట్టి హిందూ సొసైటీ యుద్ధానికి సిద్ధం కావాలని ఆయన చెప్పడం దుమారం రేపింది. తీర్పు తర్వాత ఎలాంటి పరిణామానానికైనా సిద్ధంగా ఉండాలని కోరారు.

ఇదే గజరాజ్ గతంలోనే ముస్లింల పవిత్ర మక్కాలో ఉన్నది శివలింగం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ వివాదాస్పద మాటలు మాట్లాడే గజరాజ్ తాజాగా అయోధ్య తీర్పు నేపథ్యంలో నోరుజారారు. అయితే బీజేపీ నేతలు చీవాట్లు పెట్టడంతో దేవుళ్ల కోణంలోనే అలా మాట్లాడానని గజరాజ్ వివరణ ఇచ్చాడు.