Begin typing your search above and press return to search.

ఆలూ లేదు.. చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అంటే ఇదేనా? 

By:  Tupaki Desk   |   25 Nov 2022 10:30 AM GMT
ఆలూ లేదు.. చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అంటే ఇదేనా? 
X
ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్‌ స్థానంలో గిడుగు రుద్రరాజు నియమితులైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గిడుగు రుద్రరాజు ప్రకటించారు. ఇటీవల భారత్‌ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్‌ గాంధీ సైతం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో యాత్ర చేసేటప్పుడు తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఆలూ లేదు.. చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు కాంగ్రెస్‌ పార్టీ తీరు ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి ఏపీకి తీరని అన్యాయం చేసిందే కాంగ్రెస్‌ పార్టీ అని మండిపడుతున్నారు. నాటి కేంద్ర హోం మంత్రి, తమిళనాడుకు చెందిన చిదంబరం చెప్పిన మాటలు విని కాంగ్రెస్‌ బలైపోయిందని గుర్తు చేస్తున్నారు.

రాష్ట్ర విభజన దెబ్బకు ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు ఎన్నికలు 2014, 2019ల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని అంటున్నారు. పోనీ వృతం చెడ్డా ఫలితం అయినా దక్కిందా అనుకుంటే తెలంగాణలోనూ అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్‌లో నాడు కీలక పాత్ర పోషించిన ఏపీ నేతలంతా వైసీపీ, టీడీపీల్లో చేరిపోయారు. వృద్ధతరం నేతలు మాత్రమే కాంగ్రెస్‌లో ఉన్నారు.

ఏపీ కాంగ్రెస్‌ నేతల్లో ప్రస్తుతమున్న వారిలో ఎవరికీ ప్రజాకర్షణ లేదంటున్నారు. మరోవైపు ప్రచార కమిటీ చైర్మన్‌గా తనను నియమించడాన్ని హర్షకుమార్‌ తిరస్కరించారు. తనకీ పదవి వద్దన్నారు. అన్ని పార్టీలకు ఏపీలో అగ్ర వర్ణాలే వారే అధ్యక్షులుగా ఉన్నారని.. చివరకు కాంగ్రెస్‌ పార్టీకి కూడా గిడుగు రుద్రరాజు రూపంలో బ్రాహ్మణుడిని అధ్యక్షుడిని చేశారని ఆయన విమర్శిస్తున్నారు. దీనికి నిరసనగా ప్రచార కమిటీ చైర్మన్‌ పదవి వద్దని తిరస్కరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో సైతం కాంగ్రెస్‌ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకడమే ఎక్కువ. దొరికినా డిపాజిట్లు తెచ్చుకోవడమే కష్టం. అలాంటిది తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా తెస్తామని గిడుగు రుద్రరాజు హాస్యాస్పద ప్రకటనలు ఎందుకని నెటిజన్లు నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌ మళ్లీ బతికి బట్టకట్టే చాన్సే లేదని అంటున్నారు.

ప్రత్యేక హోదా తీసుకురావడంతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇద్దరూ తీవ్రంగా విఫలమయ్యారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబేమో బీజేపీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీకి మొగ్గు చూపి హోదాకు తన వంతు పాతరేశారని మండిపడుతున్నారు. ఇక జగన్‌ తనను గెలిపిస్తే ప్రత్యేక హోదా తెస్తానని.. ఊరూవాడా ప్రచారం చేసి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించినా ప్రత్యేక హోదా విషయంలో ఏమీ చేయలేకపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనపై కేసుల విషయంతో బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రానికి రావాల్సిన దేన్నీ అడగలేని దుస్థితిలో జగన్‌ ఉన్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజువి కామెడీ స్టేట్‌మెంట్లేనని ప్రజల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌ను మరోమారు నమ్మి తప్పు చేసే పరిస్థితిలో ప్రజలు లేరని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.