Begin typing your search above and press return to search.

ప‌్రేమ కాదంద‌ని పెట్రోల్ పోసి త‌గ‌లెట్టాడు

By:  Tupaki Desk   |   27 Feb 2019 7:45 AM GMT
ప‌్రేమ కాదంద‌ని పెట్రోల్ పోసి త‌గ‌లెట్టాడు
X
మ‌రో దారుణం చోటు చేసుకుంది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మ‌ధ్య కాలంలో తెలంగాణ ప్రాంతంలో అమ్మాయిల మీద ఆరాచ‌కాలు అంత‌కంత‌కూ పెరుగుతోన్నాయి. మొన్న‌టికి మొన్న ప్రేమ‌కు నో చెప్పింద‌ని హైద‌రాబాద్‌ లో బొండాం క‌త్తితో న‌డి వీధిలో న‌రికే ప్ర‌య‌త్నం చేయ‌టం.. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లిస్తే.. వైద్యుల కార‌ణంగా బ‌తికి బ‌ట్ట‌క‌ట్టింది.

ఈసారి వరంగ‌ల్ లో ఆరాచ‌క ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న ప్రేమ‌కు నో చెప్పింద‌న్న కార‌ణంతో ఒక ఉన్మాది రెచ్చిపోయాడు. త‌న తోటి విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వ‌రంగ‌ల్ జిల్లా సంగెం మండ‌లం రామ‌చంద్రాపురానికి చెందిన ర‌వ‌ళి అనే యువ‌తి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతోంది.

త‌న ప్రేమ‌ను కాదంటున్న ర‌వ‌ళిపై ఆగ్ర‌హం పెంచుకున్న అదే కాలేజీకి చెందిన అన్వేష్ అనే యువ‌కుడు పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. ఊహించ‌ని ప‌రిణామంతో ఆమె భీతిల్లింది. మంట‌ల్లో కాలిపోయింది. 80 శాతం గాయాల‌తో ఆమె ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతోంది. ఈ పైశాచిక చ‌ర్య‌ను చూసిన అక్క‌డి విద్యార్థులు అన్వేష్ కు దేహ‌శుద్ధి చేసి.. పోలీసుల‌కు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో అన్వేష్ ఉండ‌గా.. ర‌వ‌ళి తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప‌రిస్థితి అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు.