Begin typing your search above and press return to search.

అదే ఉంటే మీ దగ్గరకు ఎందుకొస్తారు గవర్నర్‌ సాబ్‌?

By:  Tupaki Desk   |   10 July 2015 2:48 PM IST
అదే ఉంటే మీ దగ్గరకు ఎందుకొస్తారు గవర్నర్‌ సాబ్‌?
X
రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ఈఎన్‌ఎల్‌ నరసింహన్‌ కాస్తంత చిరాకు పడుతున్నారా? నిత్యం ఏదో ఒక పంచాయితీ మీద తనను కలవటం.. చేతిలో ఒక వినతిపత్రం ఇచ్చి పోవటం.. దానికి కౌంటర్‌గా వైరిపక్షం వారు వచ్చి మరో వినతిపత్రం ఇవ్వటం.. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా సాగుతున్న తంతుపై కాస్తంత చిరాకు వచ్చిందేమో కానీ.. తాజాగా ఏపీ సీఎస్‌కు గవర్నర్‌ నుంచి ఊహించని సమాధానం ఎదురైంది.

పదో షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించిన అంశాలపై నెలకొన్న వివాదం నేపథ్యంలో గవర్నర్‌ వద్దకు వినతిపత్రం ఇచ్చేందుకు ఏపీ సీఎస్‌ కృష్ణారావు.. ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ శ్రీనివాస్‌లు వచ్చారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ దృష్టికి సమస్యల్ని తీసుకొచ్చారు. వారి వాదన విన్న గవర్నర్‌.. మీ సమస్యలు ఏమైనా ఉంటే మీ రెండు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకోవచ్చుగా?.. అన్ని అంశాలపై చర్చించుకోవచ్చుగా అంటూ సూచన చేసినట్లు చెబుతున్నారు. నిజానికి రెండు రాష్ట్రాల మధ్య కూర్చొని మాట్లాడుకునే పరిస్థితే ఉంటే.. గవర్నర్‌ దాకా విషయాలు ఎందుకు వెళతాయి?

అయినా.. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరినొకరు ఎదురుపడటానికి కూడా ఇష్టపడని విషయం తెలిసిన గవర్నర్‌.. కూర్చొని చర్చించుకోవచ్చుగా అన్న వ్యాఖ్యలు చేయటంలో అంతర్యం ఏమిటన్నది ఒక ప్రశ్న అయితే.. రెండు రాష్ట్రాల మధ్యనున్న సంబంధాల గురించి తెలిసిన గవర్నర్‌.. ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల్ని కూర్చొబెట్టి మాట్లాడితే సరిపోతుందిగా? అలా కాకుండా.. మీరే కూర్చొని మాట్లాడుకోండని చెప్పటంలో అర్థం ఏమిటో..?