Begin typing your search above and press return to search.

దుమారం: లేడి మోడల్స్ పై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 Aug 2021 4:35 AM GMT
దుమారం: లేడి మోడల్స్ పై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు
X
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తాజాగా లేడి మోడల్స్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆభరణాల కంపెనీలు తమ ప్రకటనల్లో మోడల్స్ ను పెళ్లి కుమార్తెలుగా చూపించవద్దని ఆయన సూచించడం వివాదాస్పదమైంది. కేరళలో కొన్ని రోజుల క్రితం వెలుగుచూసిన వరకట్న బాధితురాలి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 100 శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు వెలుగుచూడడం పట్ల ఆందోళన వ్యక్తమైంది.

ఈ ఘటన అనంతరం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వరకట్న దురాచరానికి వ్యతిరేకంగా ఒకరోజు ఉపవాస దీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

కొచ్చిలోని కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషన్ స్టడీస్ 7వ కాన్వొకేషన్ వేడుకకు గవర్నర్ ఆరిఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్ ను పెళ్లి కుమార్తెలా చూపించకూడదు. దీని వల్ల జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతాయి. వేరే విధంగా చూపించాలి. ఇలాంటి యాడ్స్ లో పెళ్లి కుమార్తె ఒంటి నిండా బంగారు ఆభరణాలు వేసి చూపిస్తారు. దాంతో జనాలు పెళ్లి కుమార్తె అంటే ఇంత అట్టహాసంగా భారీగా నగలు ధరించాలని భావించే ప్రమాదం ఉంది. కనుక బంగారు ఆభరణాల ప్రకటనల్లో మోడల్స్ ను పెళ్లి కుమార్తెలుగా చూపించకండి అని కోరారు.

ఈ క్రమంలోనే విద్యార్థుల చేత కట్నం తీసుకోము.. ఇవ్వం అని గవర్నర్ ప్రమాణం చేయించారు. విద్యార్థులు కాలేజీలో చేరిన సమయంలోనే వారి వద్ద నుంచి కట్నం ఇవ్వం తీసుకోం అని బాండ్ తీసుకోవాలని గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వరకట్న దురాచారం బలంగా పెనవేసుకుపోయిందని.. దాన్ని తొలగించడానికి కఠిన చట్టాలతోపాటు జనాల్లో అవగాహన కూడా రావాలని ఆరిఫ్ అన్నారు.