Begin typing your search above and press return to search.

8 నెలల తర్వాత... రూ.1 లక్ష కోట్ల దిగువకు జీఎస్టీ వసూళ్లు

By:  Tupaki Desk   |   9 July 2021 10:30 AM GMT
8 నెలల తర్వాత... రూ.1 లక్ష కోట్ల దిగువకు జీఎస్టీ వసూళ్లు
X
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు, లాక్‌ డౌన్ల కారణంగా జూన్‌ లో కేంద్రానికి జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) రాబడి భారీగా గండిపడింది. గత ఎనిమిది నెలలుగా దాదాపుగా రూ.లక్ష కోట్ల మార్క్‌ పైనే ఉన్న జీఎస్‌టీ వసూళ్లు.. జూన్ నెలలో రూ.92 వేలకోట్లు గా నమోదు అయ్యాయి. అయితే గతేడాది జూన్‌ నెల వసూళ్లతో పోలిస్తే ఇది 2శాతం ఎక్కువ అని కేంద్ర ఆర్థికశాఖ ప్రకటించింది. జూన్‌ రూ. 92,849కోట్ల మేర జీఎస్‌టీ వసూలైంది. ఇందులో కేంద్రం వాటా (సీజీఎస్‌ టీ) రూ.16,424కోట్లు, రాష్ట్రాల జీఎస్‌ టీ(ఎస్‌ జీఎస్‌ టీ) రూ.20,397 కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. సమ్మిళిత జీఎస్‌ టీ కింద రూ. 49,079కోట్లు, సెస్‌ రూపంలో రూ. 6,949కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్ డౌన్స్ , కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకొచ్చాయి. దీనితో ఆ నెలలో వ్యాపార కార్యకలాపాలు బాగా తగ్గాయి. ఏప్రిల్‌లో 5.88కోట్ల ఈ-వే బిల్లులు రాగా, మే నెలలో వాటి సంఖ్య 3.99కోట్లు మాత్రమే. దీంతో జూన్‌ నెలలో జీఎస్‌ టీ వసూళ్లు తగ్గినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల గత నెలలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు సాధారణానికి వచ్చాయి. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడం వల్ల జూన్‌లో 5.5కోట్ల ఈ-వే బిల్లులు జనరేట్‌ అయ్యాయి. దీంతో జులై నెల నుంచి మళ్లీ వసూళ్లు పెరుగుతాయని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. కరోనాపై పోరాటంలో భాగంగా.. కేంద్రం రాయితీలు ప్రకటించడమే జీఎస్టీ వసూళ్లు తగ్గుదలకు కారణం అని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు ఇకపోతే , రూ.1.41లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో ఏప్రిల్‌ నెల ఆల్‌ టైమ్‌ రికార్డుగా నిలిచింది.