Begin typing your search above and press return to search.

ఐఐటీ టు హిమాల‌య‌..విద్యార్థి అడ్ర‌స్ చిక్కింది

By:  Tupaki Desk   |   16 Feb 2016 12:51 PM GMT
ఐఐటీ టు హిమాల‌య‌..విద్యార్థి అడ్ర‌స్ చిక్కింది
X
టెక్నాల‌జీ దిగ్గజాల‌ను త‌యారు చేసే విద్యా ప్రాంగ‌ణమైన ఐఐటీలో చ‌దివే విద్యార్థిని అధ్యాత్మిక మార్గం ఎంచుకోవ‌డ‌మే కాకుండా ఏకంగా స‌న్యాసిని కావాల‌ని నిర్ణ‌యం తీసుకొని హిమాల‌యాల‌కు వెళ్లిన ఘ‌ట‌న నెల‌రోజుల క్రితం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఐఐటీ మద్రాస్‌ లో ఇంజినీరింగ్ డిజైన్ లో ఎమ్ ఎస్ చేస్తున్న వేదాంతం ఎల్. ప్రత్యూష అనే విద్యార్థిని ఈ విధంగా హ‌ఠాత్తుగా మాయ‌మ‌వ‌డం ద్వారా సృష్టించిన‌ క‌ల‌క‌లానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. ఆమె ఓ దొంగ బాబా వ‌ద్ద ఉన్న‌ట్లు తేలింది.

సన్యాసిని కావాలన్న ఆకాంక్షతో హిమాలయాలకు వెళ్తున్న‌ట్లు తన హాస్టల్ రూంలో ప్ర‌త్యూష లేఖ రాసి అదృశ్య‌మ‌యింది. ఆధ్యాత్మిక జీవనం గడపాలనే లక్ష్యంతో తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన‌డ‌మే కాకుండా తన కుటుంబ సభ్యులు సహా ఎవరూ తనెక్కడున్నానన్నది ఎన్నటికీ తెలుసుకోలేరని కూడా ఆ లేఖలో రాసింది. హాస్ట‌ల్ వ‌ర్గాలు స‌మాచారం ఇవ్వ‌డంతో గుంటూరుకు చెందిన ఆమె త‌ల్లిదండ్రులు తీవ్ర క‌ల‌త చెంది స్థానిక చెన్నైలోని కొట్టుర్పూరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు ప్ర‌త్యూష‌ తండ్రి పురుషోత్తమ‌న్ స్వ‌యంగా త‌న కుటుంబ సభ్యులతో కలిసి ఉత్తరాఖండ్ పోలీసుల‌తో చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించింది.

ప్ర‌త్యూష లేఖ రాసి వెళ్లేముందు మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా కూపీలాగితే భాస్కర్ అనే వ్యక్తితో ఆరు సార్లు ఫోన్లో మాట్లాడింది. ఈ వ్య‌క్తి శివ గుప్తా అనే దొంగ‌బాబా కు చెందిన శిష్యుడుగా తేలింది. మోక్ష మార్గం కోసం త‌మ‌గురువును న‌మ్ముకోవాల‌ని చెప్ప‌డంతో భ్ర‌మ‌ప‌డిన ప్ర‌త్యూష అదృశ్యం అయింద‌ని తేలింది. దీంతో సెల్‌ ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా ఆమె చివ‌రిగా మాట్లాడిన ప్రాంతానికి పోలీసులు - పురుషోత్త‌మ‌న్‌ వెళ్ల‌గ‌లిగారు. అక్క‌డి ప్రాంతాల‌న్నింటా క్షుణ్ణంగా ఆరాతీసిన నేప‌థ్యంలో ఆమె దొంగ బాబా ఆశ్ర‌మంలో గుర్తించారు.

త‌న బిడ్డ‌ను గుర్తించిన పురుషోత్త‌మ‌న్ ఆమెను దొంగ‌బాబా చెర‌నుంచి విడిపించి గుంటూరులోని త‌న నివాసానికి తీసుకువ‌చ్చారు. ప్ర‌త్యూష‌తో పాటు అనేక‌మంది మోస‌పోయిన మ‌హిళ‌లు శివ‌గుప్తా బాబా చేతిలో చిక్కుకుపోయార‌ని తెలుస్తోంది.