Begin typing your search above and press return to search.

అమిత్‌ షాకు చ‌రిత్ర చెప్పిన హ‌రీశ్ రావు

By:  Tupaki Desk   |   19 Sep 2016 4:47 AM GMT
అమిత్‌ షాకు చ‌రిత్ర చెప్పిన హ‌రీశ్ రావు
X
బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌రంగ‌ల్ స‌భ‌లో చేసిన కామెంట్ల‌పై అధికార టీఆర్ ఎస్ పార్టీ ఘాటు విమ‌ర్శ‌లు చేసింది. సీఎం కేసీఆర్ ఎంఐఎంకు భయపడుతున్నారని - అందుకే విమోచన దినోత్సవం జరుడపం లేదన్న షా వ్యాఖ్య‌ల‌పై కేసీఆర్ మేన‌ల్లుడు - నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు మండిప‌డ్డారు. అమిత్ షాకు అస‌లు చ‌రిత్ర తెలుసా అంటూ ప్ర‌శ్నించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ విశిష్ట‌త‌లు తెలిపారు. కేసీఆర్ మొండిఘటమ‌ని. ఆయన ఏనాడూ భయపడరని హ‌రీశ్ చెప్పారు. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడి - కేంద్రాన్ని కదిలించి తెలంగాణ సాధించారనే విషయం అమిత్‌ షాకు తెలియదేమోన‌ని ఎద్దేవా చేశారు.

"వాజ్‌ పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారని అప్పుడు కూడా బీజేపీతో టీడీపీకి పొత్తు ఉన్న‌పుడు విమోచన దినోత్సవం నిర్వహించాలని చంద్రబాబును బీజేపీ డిమాండ్ చేయలేదు..? అమిత్‌ షా చరిత్ర తెలుసుకుని మాట్లాడాలి. ఆయన మాటలు కసాయివాడు శాంతి ప్రవచనాలు చెప్పినట్లుగా ఉంది. ఉత్తరాఖండ్ - అరుణాచల్‌ ప్రదేశ్‌ లో సీఎంలను దించి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నారు. ప్రాంతీయ పార్టీ పెట్టించి 45 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేయించిన ఘనత బీజేపీకే దక్కుతుంది. కేంద్ర మంత్రులుగా ఉన్న పురంధేశ్వరి - కావూరి సాంబశివరావుకు ఎన్ని కోట్లు ఇచ్చి బీజేపీలో చేర్చుకున్నారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అప్పుడూ - ఇప్పుడూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. కేవలం నాలుగు ఓట్లు - సీట్ల కోసం ఇక్కడ రాజకీయం చేస్తామంటే ప్రజలు అంగీకరించరు. మత విద్వేషాన్ని రగిలిస్తే ప్రజలు రెచ్చిపోరు. మత సామరస్యమే ఇక్కడి ప్రజల జీవన విధానం. బీజేపీ విధానాలకు ఇక్కడి ప్రజలు వ్యతిరేకం. బీజేపీ - టీఆర్‌ ఎస్ ఎజెండాల మధ్య స్పష్టమైన తేడా ఉంది" అని హ‌రీశ్ రావు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి తాము బాగా సాయం చేశాం - దానధర్మాలు చేశామని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకొంటున్నారని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు మా హక్కు మాత్రమేనని, రాష్ట్ర ప్రజలు చెల్లించిన పన్నుల్లోంచి రావాల్సిన వాటా వచ్చిందని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.ఎప్పుడు మాట్లాడినా రూ.90వేల కోట్లు ఇచ్చాం అని అంటున్నారని.. మాకు రావాల్సిన వాటా కింద వచ్చినవి రూ.47వేల కోట్లు మాత్రమేనని.. రావాల్సినవి కూడా పూర్తిగా ఇవ్వడంలేదని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తున్నప్పుడు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకివ్వడం లేదో చెప్పాలని నిలదీశారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి - ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ విషయంపై చాలాసార్లు అడిగామని గుర్తు చేశారు."#ఇప్పటికే స్థలం ఇచ్చినా మా కాజీపేట్ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఎందుకు ప్రారంభించరు..? మామునూరులో ఏర్పాటుచేస్తామని చెప్పిన ఎయిర్‌పోర్ట్ ఏది..? ఐటీఐఆర్ - పరిశ్రమలకు రాయితీలు - హైకోర్టు విభజన ఎక్కడ...? అధికారంలోకి వచ్చిన వెంటనే రాత్రికి రాత్రే ఆరు మండలాలను ఆంధ్రలో కలిపేశారు. లోయర్ సీలేరు - ఇందిరాసాగర్ ప్రాజెక్టులు ఆంధ్రకు పోయాయి. పోలవరం వల్ల తెలంగాణలో ఎంతోమంది గిరిజనులు నిరాశ్రయులవుతున్నారు. వారి పునరావాసానికి కేంద్రం ఇచ్చిందేమిటి..? మాకు హక్కుగా రావాల్సినవే ఇవ్వడంలేదు.. ఇంక అదనంగా ఎక్కడ ఇచ్చారు అని ప్రశ్నించారు. తెలంగాణకు ఏమేం రావాలో..? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోనే స్పష్టంగా ఉన్నాయి' అని వ్యాఖ్యానించారు.