Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌ తో బాబు పొత్తుకు ఓటుకు నోటుతోనే బీజం

By:  Tupaki Desk   |   1 Dec 2018 11:00 PM IST
కాంగ్రెస్‌ తో బాబు పొత్తుకు ఓటుకు నోటుతోనే బీజం
X
తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశ‌వ్యాప్తంగా చ‌ర్చనీయాంశంగా మారిన రెండు కీల‌క అంశాల‌పై టీఆర్ ఎస్ పార్టీ నేత‌ - అప‌ద్ధ‌ర్మ మంత్రి హరీశ్‌ రావు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. ఆ రెండు విష‌యాలే ఒక‌టి టీడీపీ- కాంగ్రెస్ పొత్తు - మ‌రొక‌టి ఓటుకునోటు కేసు. ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్ప‌డుతూ అడ్డంగా దొరికిపోయిన ఉదంతంతో ప్ర‌స్తుత కాంగ్రెస్ నేత రేవంత్‌ రెడ్డి ఇర‌కాటంలో ప‌డ‌టం ఇందులో ప్రస్తుత ఏపీ సీఎం పాత్ర ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు రావ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. ఇక సిద్ధాంతాల‌ను తుంగ‌లొ తొక్కి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం సైతం అదే స్థాయిలో ఆస‌క్తిని రేకెత్తించింది. ఈ ప‌రిణామాల‌ను క‌లిపి తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో టీఆర్ ఎస్ నేత హ‌రీశ్‌ రావు కొత్త సూత్రీక‌ర‌ణ చేశారు.

చంద్ర‌బాబు తెలంగాణ‌పై త‌న కుట్రలు మ‌ళ్లీ చేస్తున్నార‌ని హ‌రీశ్ రావు ఆరోపించారు. `చంద్రబాబు కుట్రలు ప్రజలు అర్థం చేసుకోవాలి. లగడపాటి - చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలి. తెలంగాణను అడ్డుకునేందుకు లగడపాటి లాంటి వాళ్లు ఎన్నో కుట్రలు చేస్తున్నారు. లగడపాటి చంద్రబాబు సీక్రెట్ ఏజెండా ఏంటీ? కాంగ్రెస్ ఇచ్చే ప్రకటనలకు డబ్బులెవరు ఇస్తున్నారు? ఆంధ్రా నుంచి నోట్ల కట్టలు వస్తుంటే.. ఆ డబ్బుతో పేపర్లలో పెద్దపెద్ద ప్రకటనలు ఇస్తున్నారు` అని మంత్రి హరీశ్‌ రావు ఆరోపించారు. తెలంగాణ తెచ్చుకున్నది అమరావతికి గులాంగిరి చేయడానికా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు హోంశాఖను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చంద్రబాబు కేంద్రానికి 35లేఖలను రాశాడని విమర్శించారు.

పొరపాటున ప్రజాకూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని హ‌రీశ్‌ రావు వెల్ల‌డించారు. రైతులను ఆదుకున్నది టీఆర్ ఎస్ ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు పథకం ఉండదని అంటున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ``కాంగ్రెస్ అధికారంలోకి వస్తే యాదాద్రి థర్మల్ ప్లాంట్ మూసేస్తామంటున్నారు. పొన్నాల లక్ష్మయ్య సొంతూరుకే కరెంట్ ఇవ్వడానికి చేతకాలేదు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వననప్పుడు పొన్నాల లక్ష్మయ్య అసెంబ్లీలో కూర్చొని కిలకిల నవ్వాడు. అలాంటి వ్య‌క్తికి ఓటువేయాలా? `` అని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ - విత్తనాలు.. ఎరువుల కొరత ఉండేది. బ్యాంకులో అప్పు కూడా పుట్టని పరిస్థితి ఉండేది. పంట పెట్టుబడి ఏడాదికి రూ.8వేల నుంచి రూ.10వేలు చేస్తామని మంత్రి వివరించారు.