Begin typing your search above and press return to search.

హ‌రీష్‌రావు హాట్ కామెంట్స్‌.. అలా చేస్తే... మోడీకి పాలాభిషేకం చేస్తారట‌!

By:  Tupaki Desk   |   14 Aug 2021 2:51 PM GMT
హ‌రీష్‌రావు హాట్ కామెంట్స్‌.. అలా చేస్తే... మోడీకి పాలాభిషేకం చేస్తారట‌!
X
సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్‌గా నిలిచే మంత్రి హ‌రీష్‌రావు.. తాజాగా రాష్ట్ర ప్ర‌తిప‌క్షం బీజేపీకి పెద్ద స‌వాలే రువ్వారు. ``అలా చేస్తే.. ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీకి, రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుఉడు బండి సంజ‌య్‌కి పాలాభిషేకం చేస్తాం`` అని వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాష్ట్ర రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపుతున్నాయి. నిత్యం విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేసుకునే టీఆర్ ఎస్‌-బీజేపీలు.. ఇప్పుడు సవాళ్ల వ‌ర‌కు వ‌చ్చాయ‌ని.. ముఖ్యంగా ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు చేసిన వ్యాఖ్య‌లను బీజేపీ నేత‌లు స్వీక‌రిస్తారా? అస‌లు ఎలా రియాక్ట్ అవుతారు? అనే విష‌యాల‌పై జోరు చ‌ర్చ సాగుతోంది.

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని అధికార టీఆర్ ఎస్ నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. ఇది ఆ పార్టీకి ఇజ్జ‌త్‌కా స‌వాల్‌గా మారిన విష‌యం తెలిసిందే. పార్టీని గెలిపించ‌డం కాదు.. త‌మ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌.. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఓడించ‌డం.. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు అత్యంత కీల‌కం. ఈ నేప‌థ్యంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక కేంద్రంగా అధికార పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ద‌ళిత బంధు వంటి కీల‌క ప‌థ‌కాన్ని ఇక్క‌డ నుంచి ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. ఈ నియోజ‌వ‌క‌ర్గంలోనే పైల‌ట్ ప్రాజెక్టుగా ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు.

అదేస‌మ‌యంలో మునుపెన్న‌డూ లేని విధంగా.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి ఏకంగా రూ.2000 కోట్లను కేటాయించనున్నారు. దీనికి సంబంధించి కేబినెట్ అప్రూవ‌ల్ కూడా తీసుకున్నారు. ఇవే విష‌యాల‌ను తాజాగా హుజూరాబాద్‌లో ప‌ర్య‌టించిన హ‌రీష్ రావు వెల్ల‌డించారు. ఎల్లుండి దళిత బంధు ప్రారంభం అవుతుంద‌న్నారు. పైలెట్ ప్రాజెక్ట్ గా హుజురాబాద్ ను తీసుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఈ ప‌థ‌కంపై బీజేపీ నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని విమ‌ర్శించారు. దళిత బంధు పూర్తి దళిత కుటుంబాలకు అందిస్తామ‌ని చెప్పిన హ‌రీష్‌రావు... రైతు బంధు అమలప్పుడు కూడా ఇదే దుష్ప్రచారం చేశారని బీజేపీ నేత‌లపై విరుచుకుప‌డ్డారు.

అప్ప‌ట్లో `రైతు బంధు` ప‌థ‌కానికి చప్పట్లు కొట్టిన నేతలు, ఇప్పుడు దళిత బంధు ప‌థ‌కం ప్రారంభిస్తున్నామంటే.. గుండెలు కొట్టుకుంటున్నారని విమ‌ర్శించారు. హుజురాబాద్ కోసం 2000 కోట్ల కేటాయింపుపై క్యాబినెట్ తీర్మానం తీసుకున్న‌ట్టు తెలిపారు. 20 వేల కుటుంబాలకు ద‌ళిత బంధుప‌థ‌కంలో పూర్తిస్థాయిలో లబ్ది జరుగుతుంద‌న్న హ‌రీష్‌రావు... సీఎం దళిత అభివృద్ధికి సంబంధించిన సాధికార‌త‌ను బడ్జెట్‌లోనే తీర్మానం చేసిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. అయితే.. తాము ద‌ళిత బంధుకు రూ.10 ల‌క్ష‌లు ఇస్తున్న విష‌యాన్ని రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రాజ‌కీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించిన హ‌రీష్ రావు.. ద‌ళితుల‌కు 50 ల‌క్ష‌లు ఇవ్వాల‌న్న బండి డిమాండ్‌ను తిప్పికొట్టారు.

``బండి సంజయ్ దళిత బంధుకు 50 లక్షలియ్యాలన్నారు. మేం 10 ల‌క్ష‌లు కేటాయించాం. కేంద్రం నుండి మీరు 40 లక్షలివ్వండి. అలా చేస్తే.. ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీకి బండి సంజయ్ కి పాలాభిషేకం చేస్తాం`` అని హ‌రీష్ రావు స‌వాలు విసిరారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు బీజేపీని సంక‌టంలోకి నెట్టిన‌ట్టేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్ని కుట్రలు చేసిన దళిత సోదరులకు పథకం అందిస్తామ‌ని.. హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ప్రతిపక్షాల కుట్రల ఆనందం తాత్కాలికమే అని దుయ్య‌బ‌ట్టారు. మ‌రి హ‌రీష్ వ్యాఖ్య‌ల‌పై.. బీజేపీ నేత‌లు.. ముఖ్యంగా బండి సంజ‌య్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.