Begin typing your search above and press return to search.

మోడీ పై నిప్పులు చెరిగిన హ‌రీష్‌రావు.. రీజ‌న్ ఇదే!

By:  Tupaki Desk   |   8 Feb 2022 10:52 PM IST
మోడీ పై నిప్పులు చెరిగిన హ‌రీష్‌రావు.. రీజ‌న్ ఇదే!
X
ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీపై తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు నిప్పులు చెరిగారు. వేరుపడ్డాం.. బాగుపడ్డామని ప్రజలు భావిస్తున్నారని.. కానీ రాజ్యసభలో ప్రధాని చేసిన బాధ్య‌తా ర‌హిత‌ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల హృదయాలను గాయపరిచాయని మంత్రి హరీష్‌రావు అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును బీజేపీ ఎంతగా వ్యతిరేకిస్తుందో... ఈ ఘటనతో మరోసారి రుజువైందని హరీష్‌రావు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ... దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే... ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతున్నారని హరీష్ రావు విమర్శించారు. ఏపీ విభజనపై రాజ్యసభలో మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల హృదయాలను గాయపరిచాయన్నారు. ప్రధాని మోడీ.. సమైఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీష్‌రావు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండిచెయ్యి ఎదురైందన్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉంద‌న్నారు. కానీ ఎందుకో మోడీకి నచ్చడం లేదని హ‌రీష్‌రావు ఫైర‌య్యారు. అభివృద్ధిలో గుజరాత్ను దాటిపోతున్నామనే అక్కసు మోడీలో ఉన్నట్లు కనిపిస్తోంద‌న్నారు. వేరుపడ్డాం... బాగుపడ్డామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని అన్నారు. కాకినాడ తీర్మానం ప్రకారం తెలంగాణ ముందే ఏర్పాటైయుంటే.. మా యువకులు బలిదానాలు చేసుకొనే వాళ్లా.. 2004లోనే తెలంగాణ వచ్చుంటే మా శ్రీకాంతాచారి అమరుడయ్యేవాడా.. యువకుల బలిదానాలకు కారణం.. ఈ బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు అని మండిప‌డ్డారు.

రాజ్యసభలో ప్రధాని మోదీ మాటలు.. తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచాయ‌న్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధాని ఎంత వ్యతిరేకిస్తున్నారో అర్థమవుతోంద‌న్నారు. కాగా, పార్ల‌మెంటులో ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే... ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో మైకులు ఆపేసి... ఎలాంటి చర్చ జరగకుండానే ఆంధ్రప్రదేశ్‌ విభజన చేశారని.. అందుకే తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని... మోడీ ఆక్షేపించారు. దీనిపై హ‌రీష్ రావు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డడం గ‌మ‌నార్హం.