Begin typing your search above and press return to search.

వంటేరు చేరిక‌తో అధిక న‌ష్టం హ‌రీశ్ కే!

By:  Tupaki Desk   |   19 Jan 2019 9:00 AM GMT
వంటేరు చేరిక‌తో అధిక న‌ష్టం హ‌రీశ్ కే!
X
టీఆర్ ఎస్ అగ్ర‌నేత‌ల్లో హ‌రీశ్ రావు ఒక‌రు. సిద్ధిపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయ‌న అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే - ఆయ‌నకు ఒక్క సిద్ధిపేట‌లోనే కాదు.. రాష్ట్రమంత‌టా మంచి జ‌నాద‌ర‌ణ ఉంది. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న రాష్ట్రవ్యాప్తంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించారు. గులాబీ పార్టీ విజ‌యానికి కృషిచేశారు.

పార్టీలో ఇన్నాళ్లూ ఓ వెలుగు వెలిగారు హ‌రీశ్. ఇప్పుడు మాత్రం ఆయ‌న ప‌రిస్థితి తీసుక‌ట్టుగా మారింది. ఇప్ప‌టికే టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కుమారుడు కేటీఆర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ద్వారా పార్టీలో హ‌రీశ్ ప్రాధాన్యాన్ని కేసీఆర్ త‌గ్గించారు. తాజాగా వంటేరు ప్ర‌తాప్ రెడ్డి చేరిక‌తో ఆయ‌న ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది.

ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలోని గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఆ స్థానం బాధ్య‌త‌ల‌ను హ‌రీశే ఇన్నాళ్లూ చూసుకున్నారు. అక్క‌డ కేసీఆర్ పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ఇప్పుడు టీఆర్ ఎస్ లో చేరిపోయారు. దీంతో గ‌జ్వేల్ లో గులాబీ పార్టీ బాధ్య‌త‌లు వంటేరు చేతిలోకి వెళ్లిన‌ట్లే. అంటే ఇప్పుడు హ‌రీశ్ కేవ‌లం సిద్ధిపేట‌లో సాదాసీదా ఎమ్మెల్యేగా ప‌రిమిత‌మ‌వ్వాల్సిందే.

దీంతో వంటేరు చేరిక‌తో హ‌రీశ్ కే అధిక న‌ష్టం జ‌రిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పార్టీలో ప‌ద‌వి లేదు. మంత్రి ప‌ద‌వి ఇంకా రాలేదు. అది వ‌స్తుందో లేదో కూడా అర్థం కావ‌ట్లేదు. గ‌జ్వేల్ బాధ్య‌త‌లు చేతి నుంచి జారిపోయాయి. ఈ నేప‌థ్యంలో టీఆర్ ఎస్ లో హ‌రీశ్ భ‌విత‌వ్యంపై ఆయ‌న అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది.

కొంత‌కాలంగా కేసీఆర్‌-కేటీఆర్ ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాపై ప్ర‌ధానంగా దృష్టిసారించారు. ఆప‌రేష‌న్ మెద‌క్ పేరుతో టీఆర్ ఎస్ ను జిల్లాలో బ‌లోపేతం చేస్తున్నారు. జిల్లాలో త‌న‌కు స‌న్నిహితుడైన మారెడ్డి శ్రీ‌నివాస్ రెడ్డికి తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల సంస్థ ఛైర్మ‌న్ ప‌ద‌విని కేటీఆర్ ఇటీవ‌లే ఇప్పించారు. జిల్లా వ్యాప్తంగా ప‌లువురు నేత‌ల‌ను పార్టీలో చేర్చుకుంటున్నారు. వారిలో ప‌లువురికి కీల‌క ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌ద్వారా మెద‌క్ లో హ‌రీశ్ ప్రాబ‌ల్యాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.