Begin typing your search above and press return to search.

ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య‌లో టీ టీడీపీ

By:  Tupaki Desk   |   20 Sep 2015 4:58 PM GMT
ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య‌లో టీ టీడీపీ
X
తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు ఇప్పుడు ఓ కొత్త స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన‌ప్పుడు కాంగ్రెస్ నాయ‌కులు తెలుగు వారి ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీకి తాక‌ట్టుపెట్టార‌ని విమ‌ర్శ‌లు గుప్పించేవారు. ఆయ‌న తెలుగు వారి ఆత్మ‌గౌర‌వ నిన్నాదాన్ని పాయింట్‌ గా చేసుకుని టీడీపీని స్థాపించారు. ఇప్పుడు క‌రెక్టుగా టీ టీడీపీ నేత‌ల‌ను అదే ఆత్మ‌గౌర‌వం పాయింట్‌ తో కొడుతున్నారు తెరాస నేత‌లు. ఏపీ నుంచి తెలంగాణ విడిపోయాక పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ఇటీవ‌ల ఎక్కువ‌గా విజ‌య‌వాడ‌లోనే మ‌కాం వేస్తున్నారు.

దీంతో టీ టీడీపీ నేత‌లు కూడా చంద్ర‌బాబును నేరుగా మీట్ అవ్వాలంటే విజ‌య‌వాడ‌కు వెళ్లాల్సి వ‌స్తోంది. దీన్ని ఆస‌రాగా చేసుకున్న తెరాస మంత్రులు, నాయ‌కులు తెలంగాణ టీడీపీ నాయ‌కులు తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని ఏపీ నాయ‌కుల‌కు తాక‌ట్టు పెడుతున్నారంటూ విమ‌ర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం తెలంగాణ టీడీపీ ప్ర‌జా ప్ర‌తినిధులు విజ‌య‌వాడ వెళ్లి అక్క‌డ చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో పాల్గొన్నారు.

తెలంగాణ భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్‌ రావు ఆదివారం బాన్సువాడ‌ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ టీడీఎల్పీ స‌మావేశాన్ని విజ‌య‌వాడ‌ లో నిర్వ‌హించ‌డం సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు. తెలంగాణ ప్ర‌జ‌ల ప‌రువు తీసేలా టీడీపీ నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని..వారిని తెలంగాణ ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే త‌రిమి కొడ‌తార‌ని ఆయ‌న చెప్పారు. చంద్ర‌బాబు డైరెక్ష‌న్‌లో యాక్ట్ చేస్తున్న టీ టీడీపీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రాజెక్టుల‌ను వ్య‌తిరేకిస్తున్నార‌ని హ‌రీష్ విమ‌ర్శించారు. తెరాస నేత తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మ‌గౌర‌వాన్ని ఏపీ నాయ‌కుల‌కు తాక‌ట్టు పెడుతున్న టీ టీడీపీ నేత‌ల‌కు తెరాస‌ను, తెరాస నాయ‌కుల‌ను విమ‌ర్శించే అర్హ‌త లేద‌న్నారు. ఈ విమ‌ర్శ‌ల‌కు టీ టీడీపీ నేత‌లు ఎలా కౌంట‌ర్లు ఇస్తారో చూడాలి.