Begin typing your search above and press return to search.

రోజా స‌మ‌స్య సాల్వ్ అయిందా ? పెద్దాయ‌న మ‌న్నించాడా !

By:  Tupaki Desk   |   12 April 2022 4:35 AM GMT
రోజా స‌మ‌స్య సాల్వ్ అయిందా ? పెద్దాయ‌న మ‌న్నించాడా !
X
ఎప్ప‌టి నుంచో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో రెండు వ‌ర్గాలు కొట్టుకుంటున్నాయి. అవి నానాటికీ త‌మ స్వ‌రాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. అవే రోజా వ‌ర్గం మ‌రియు పెద్ది రెడ్డి వ‌ర్గం. ఈ నేప‌థ్యంలో స్థానిక ఎన్నిక‌ల్లో కూడా రోజా వ‌ర్గం మాట నెగ్గ‌కుండాపోయింది. న‌గ‌రి మున్సిపాల్టీ కి సంబంధించి కూడా పెద్దిరెడ్డి మాటే నెగ్గింది.

ఆ రోజు పోల్ సీన్ లో కూడా నేరుగా వాగ్వాదానికి దిగినా కూడా పెద్ది రెడ్డి మ‌నుషులు రోజా రెడ్డిని ఖాత‌రు చేయ‌లేదు. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ టీడీపీ నుంచి అనూహ్యంగా బ‌య‌టకు వ‌చ్చి వైసీపీ తీర్థం అందుకుని రెండు సార్లు ఎమ్మెల్యే అయిన రోజా ఇవాళ అంతే స్థాయిలో త‌న ప‌రువు పోయిన చోటే దక్కించుకునేందుకు చేసిన ప్ర‌తి ప్ర‌య‌త్నం మొద‌ట్లో విఫ‌లం అయిన విధంగా క‌నిపించినా ఆఖ‌రికి ఫ‌లితం మాత్రం స‌ఫ‌లీకృత ధోర‌ణిలోనే ఉంది. దీంతో రోజా రెడ్డి అమాత్య ప‌ద‌వి అందుకుని పెద్దిరెడ్డి కాళ్లు మొక్కారు. ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. హాట్ టాపిక్ గా మారింది.

వాస్త‌వానికి రోజారెడ్డికి, పెద్దిరెడ్డికి ఎప్ప‌టి నుంచో వైరం ఉంది అయినా కానీ జ‌గ‌న్ ఓ విధంగా వీటిని చూసీ చూడ‌ని విధంగానే వ‌దిలేశారు. ఇంకా చెప్పాలంటే టామ్ అండ్ జెర్రీ వార్ లానే చూశారు.కొన్ని సార్లు రోజా కంట‌త‌డి పెట్టుకున్నారు కూడా! ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ను క‌లిసి త‌న బాధ‌ను వెళ్ల‌గ‌క్కారు కూడా! అయినా పెద్దాయ‌న‌ను నిలువ‌రించ‌డం అటు జ‌గ‌న్ వ‌ల్ల కానీ ఇటు స‌జ్జ‌ల వ‌ల్ల కానీ జ‌ర‌గ‌ని లేదా కుద‌రని ప‌ని అని తేలిపోయింది.

నియోజ‌క‌వ‌ర్గంలో బాహాటంగానే రోజాను నిలువ‌రించి అవ‌మానించిన ఘ‌ట‌న‌లు బోలెడు ఉన్నాయి. కొన్ని సార్లు స్థానికుల‌తో (అక్క‌డి వారు త‌మిళులు) తిట్టించిన దాఖ‌లాలు ఉన్నాయి.

ఇంకొన్ని సార్లు వైరి వ‌ర్గం అయిన టీడీపీ నాయ‌కులను ప్రోత్స‌హించి వారితో కూడా పెద్దిరెడ్డి తిట్టించారు అన్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. అయినా కూడా రోజా వీటినన్నింటినీ ఎదుర్కొన్నారు. ఆర్థిక కార‌ణాల రీత్యానే తాను టెలివిజ‌న్ షో లు చేస్తున్నానని కూడా ఓ సంద‌ర్భంలో చెప్పారు. వాటిని కూడా సాకుగా చూపి టీడీపీ నాయ‌కుల‌తో కొన్ని కామెంట్లు చేయించార‌ని, అంతేకాకుండా దాన్నొక సాకుగా చూపించి పెద్దిరెడ్డి త‌న‌ను తిట్టించార‌ని అప్ప‌ట్లో రోజా త‌న వారి వ‌ద్ద వ్యాఖ్యానించార‌ని వార్త‌లు వ‌చ్చాయి! ఏదేమ‌యినప్ప‌టికీ అవ‌న్నీ మ‌రిచిపోయి నిన్న‌టి వేళ పెద్దాయ‌న కాళ్లు మొక్కారు.

న‌గ‌రి నియోజ‌కవ‌ర్గంలో రోజాను అడుగు పెట్ట‌నివ్వ‌మ‌న్న నారాయణ స్వామి (పెద్దిరెడ్డి శిష్యుడు) మ‌నుషులు కూడా ఇప్పుడు శాంతించే ఉంటారు. దీంతో ఇన్నాళ్ల వాగ్యుద్ధానికి, అంతః క‌లహానికి నిన్న‌టితో తెర పడిందా? లేదా ముందున్న కాలంలో ఇంకొన్ని స‌వాళ్ల‌ను రోజా స్వీక‌రించాల్సి ఉందా?