Begin typing your search above and press return to search.

ఉద్యోగులు మౌళిక సూత్రాన్నే మరచిపోయారా ?

By:  Tupaki Desk   |   27 Jan 2022 5:38 AM GMT
ఉద్యోగులు మౌళిక సూత్రాన్నే మరచిపోయారా ?
X
పీఆర్సీ వివాదంలో కొద్ది రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మౌళిక సూత్రాన్ని మరచిపోయినట్లున్నారు. నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పీఆర్సీలో ఉద్యోగుల జీతాలు తగ్గడం ఎప్పుడైనా చూశామా ? అని ప్రశ్నించారు. పీఆర్సీ అంటే జీతాలు పెరగాలి కానీ తగ్గటం ఏమిటంటు ప్రభుత్వంపై మండిపోయారు.

ఇక్కడ వీళ్ళు మరచిపోయిన విషయం ఒకటుంది. అదేమిటంటే పీఆర్సీ అంటే పే రివిజన్ కమీషన్. ఇందులోనే రివిజన్ అనుంది. రివిజన్ అంటేనే అటైనా కావచ్చు లేదా ఇటైనా కావచ్చు. ఇక్కడ పీఆర్సీ అంటే జీతాలకు సంబంధించింది కాబట్టి ఉద్యోగుల జీతాలు పెరగచ్చు, లేదా తగ్గవచ్చు కూడా. మామూలుగా అయితే పీఆర్సీ అమల్లోకి వస్తోందంటే జీతాలు పెరుగుతాయనే ఎవరైనా అనుకుంటారు. ఎందుకంటే ఏ ఉద్యోగైనా తమ జీతం పెరగాలనే కోరుకుంటాడు.

అయితే పీఆర్సీ అమలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడుంటుందన్న విషయాన్ని ఉద్యోగులందరు మరచిపోయారు. రాష్ట్ర ఖజానాకు ఎలాంటి ఇబ్బందులు లేనపుడు ఉద్యోగుల జీతాలు పెంచటంలో తప్పే లేదు. కానీ ఇఫుడు పరిస్దితి రివర్సులో ఉంది. రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్రం నుండి అందాల్సినంత సాయం అందకపోవటం, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోవటం లాంటి ఇబ్బందులున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

హోలు మొత్తం మీద జీతాలు పెరిగినా ఉద్యోగులు ఆశించినంతగా జీతాలు పెంచలేకపోతున్నట్లు ప్రభుత్వం చెప్పింది. అయితే ప్రభుత్వ వాదనను ఉద్యోగనేతలు పట్టించుకోవటంలేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో తమకు సంబంధం లేదు, తాము ఆశించిన స్థాయిలో జీతాలు పెంచాల్సిందే అని పట్టుబట్టి సమ్మెలోకి దిగారు. గెజిటెడ్ అధికారులు దాఖలుచేసిన పిటీషన్ విచారణ సందర్భంగా కోర్టు ఉద్యోగుల జీతాలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టంగా చెప్పింది.

పీఆర్సీ అమలనేది ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి మీద ఆధారపడుంటుందన్న విషయాన్ని ఉద్యోగులు గుర్తుంచుకోవాలని గట్టిగా చెప్పింది. పీఆర్సీ అంటే జీతాలు పెరుగుతాయనే కాదని తగ్గించే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందని జడ్జి స్పష్టంగా ప్రకటించారు. అయినా ఉద్యోగనేతలు పట్టించుకోవటంలేదు. సరే చీఫ్ జస్టిస్ ముందుకొచ్చిన కేసు ఫైనల్ విచారణలో ఏమవుతుందో చూద్దాం.