Begin typing your search above and press return to search.

అన‌ర్హ‌త‌పై ఆ ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌కు ఎదురుదెబ్బ‌!

By:  Tupaki Desk   |   10 July 2019 11:07 AM GMT
అన‌ర్హ‌త‌పై ఆ ఇద్ద‌రు ఎమ్మెల్సీల‌కు ఎదురుదెబ్బ‌!
X
టీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీల‌లో ఇద్ద‌రు నేత‌ల‌కు తాజాగా తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా వెలువ‌డిన హైకోర్టు నిర్ణ‌యం వారికి షాకిచ్చింద‌ని చెప్పాలి. తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ‌లో టీఆర్ ఎస్ కు చెందిన ఎమ్మెల్సీలు రాములు నాయ‌క్.. యాద‌వ‌రెడ్డి.. భూప‌తిరెడ్డిలు కాంగ్రెస్ పార్టీలోకి చేర‌టం తెలిసిందే. దీంతో వీరిపై అన‌ర్హ‌త వేటు వేస్తూ అప్ప‌టి మండ‌లి ఛైర్మ‌న్ స్వామిగౌడ్ నిర్ణ‌యం తీసుకున్నారు.

అయితే.. ఈ నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ ముగ్గురు ఎమ్మెల్సీలు హైకోర్టును ఆశ్ర‌యించారు. దీనిపై న్యాయ‌స్థానంలో సుదీర్ఘ విచార‌ణ సాగింది. ఇరు వ‌ర్గాల వారు వాదోప‌వాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ స‌భ్య‌త్వంపై అన‌ర్హత వేటు వేస్తూ మండ‌లి ఛైర్మ‌న్ వేసిన అనర్హ‌త వేటు స‌రైన‌దేన‌ని.. ఆ నిర్ణ‌యం చ‌ట్ట‌బ‌ద్ధ‌మేనంటూ హైకోర్టు తాజాగా స్ప‌ష్టం చేసింది.

మండ‌లి ఛైర్మ‌న్ ఆదేశాల్ని స‌వాలు చేస్తూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను కొట్టివేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. అయితే.. ముగ్గురు ఎమ్మెల్సీల‌లో రాములు నాయ‌క్.. యాద‌వ‌రెడ్డిల విష‌యంలో తీర్పు ఇచ్చిన కోర్టు.. భూప‌తిరెడ్డిపై నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌లేదు. భూప‌తిరెడ్డికి సంబందించిన పిటిష‌న్ పై వాద‌న‌లు ముగిశాయి. తీర్పు రిజ‌ర్వులో ఉంది. ఇదిలా ఉంటే.. ఈ వ్య‌వ‌హారంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్లే వ‌ర‌కూ త‌మ స్థానాల్లో ఎన్నిక‌లు ఆపాలంటూ పిటిష‌నర్లు చేసుకున్న అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించాల‌ని ఈసీని హైకోర్టు సూచ‌న చేసింది. మ‌రి.. ఈసీ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ఇప్పుడుఆస‌క్తిక‌రంగా మారింది.