Begin typing your search above and press return to search.

జేసీకి హైకోర్టు నోటీసులు

By:  Tupaki Desk   |   19 Sep 2019 11:02 AM GMT
జేసీకి హైకోర్టు నోటీసులు
X
రాజకీయంగా ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే జెసి దివాకర్ రెడ్డి ఈసారి ఓ కేసులో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. జెసి దివాకర్ రెడ్డికి అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టు నుంచి నోటీసులు అందాయి. అక్రమ మైనింగ్ ఆరోపణల కేసులో దివాకర్ రెడ్డి - త్రిశూల్ సిమెంట్స్ కంపెనీ భాగస్వాములుగా ఉన్న ఎస్ గోపాలరావు - టి. దేవపుత్రుడు షేక్ హుస్సేన్ - నాగ సుబ్బారాయుడు తదితరులకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి - జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ నోటీసులు ఇచ్చింది.

త్రిశూల్ సిమెంట్ కంపెనీపై 2011 లో జరిగిన మైనింగ్‌ పై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై హైకోర్టు విచారించింది. ఏప్రిల్ 25 - 2006న అనంతపూర్ జిల్లా యాడికి మండలంలోని కొనుప్పలపాడు గ్రామంలో 1605 ఎకరాల్లో సున్నపురాయి తవ్వకం కోసం త్రిశూల్ సిమెంటు కంపెనీని అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో నెంబ‌ర్‌ 125 జారీ చేసింది.

ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోను స‌వాల్ చేస్తూ తాడిప‌త్రికి చెందిన వి.మురళీప్రసాద్‌ రెడ్డి 2011లో కొనుప్పలపాడులోని సర్వే నెం 22 బిలోని 1605 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా తాజాగా హైకోర్టు పైన చెప్పిన వారంద‌రికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్ర‌మంలోనే న్యాయ‌వాది స్పందిస్తూ ఈ కేసు వేసి పిటిష‌న‌ర్‌ కు వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నం లేద‌న్న విష‌యం కూడా చెప్పారు.

ఇక గ‌తంలోనే ఈ కేసుకు సంబంధించి మార్చి 7 - 2012 న ఉమ్మడి హైకోర్టు ప్రతివాదులకు నోటీసు జారీ చేసింది. నోటీసులు జారీ చేసినా దానిపై ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. ఇక అప్ప‌టి నుంచి ఈ కేసు విచార‌ణ స‌రిగా జ‌ర‌గ‌లేదు. ఈ క్ర‌మంలోనే మ‌రోసారి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణ వచ్చే నెల అక్టోబర్ కి వాయిదా పడింది. మరి ఈ నోటీసులపై జేసి దివాకర్ రెడ్డి ఎలా స్పందిస్తారో ? చూడాలి.