Begin typing your search above and press return to search.

'ఆర్థిక సర్వే' హైలెట్స్... సామాన్యుడి భాషలో !

By:  Tupaki Desk   |   1 Feb 2022 5:54 AM GMT
ఆర్థిక సర్వే హైలెట్స్... సామాన్యుడి భాషలో !
X
ఇది బడ్జెట్ కాలం. కేంద్రం ప్రవేశ పెట్టే బడ్జెట్.. అనంతరం ఆయా రాష్ట్రాలు ప్రవేశ పెట్టే బడ్జెట్ లు వరుస పెట్టేస్తుంటాయి. కేంద్రం బడ్జెట్ ను ప్రవేశ పెట్టటానికి ఒక రోజు ముందుగా ‘ఆర్థిక సర్వే’ పేరుతో ఒక నివేదికను విడుదల చేస్తుంది. అర్థమయ్యి అర్థం కానట్టుంటుంది కానీ భారతదేశం, భారతీయుల వాస్తవ ఆర్థిక పరిస్థితిని వివరించేదే ఈ ఆర్థిక సర్వే. దీనిని మీకోసం మరింత సరళంగా విపులీకరించే ప్రయత్నం చేశాం.

ఇంతకీ ఈ ఆర్థిక సర్వే అంటే ఏమిటి? తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేలో ఏయే అంశాలు ఉన్నాయి? దీని వల్ల సగటు జీవికి జరిగే లాభ నష్టాలేమిటి? అసలు జన జీవితానికి ఆర్థిక సర్వే ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పటంతో పాటు.. ఈసారి పేర్కొన్న ఆర్థిక సర్వే అంశాలతో ఎలాంటి ప్రభావం జనాల మీద పడుతుందన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాం.

దేశానికి సంబంధించి ప్రభుత్వం చేసే ఖర్చులు.. దానికి వచ్చే ఆదాయాన్ని లెక్కల రూపంలో రాసుకోవటం.. గత ఏడాదికి ప్రస్తుత ఏడాదికి మధ్య ఉండే వ్యత్యాసాల్ని నమోదు చేసుకొని.. తయారు చేసే పత్రమే ఆర్థిక సర్వే. రాబోయే బడ్జెట్ ఈ లెక్కల ఆధారంగానే రూపొందిస్తారన్నమాట.

గత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్ 1 - మార్చి 31 మధ్యకాలాన్ని) లో దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తులో ఎలాంటి సవాళ్లు పొంచి ఉన్నాయి? వాటిని ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్న విషయాన్ని ఇందులో పేర్కొంటారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశ పెట్టిన తాజా ఆర్థిక సర్వేలో ఏమేం చెప్పారు. టాప్ 10 పాయింట్స్ ను చూస్తే..

1. కరోనా కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడింది. 2021-2022 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పుంజుకుంది. భారీగా ఉన్న విదేశీ మారక నిల్వలు.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.. పెరిగిన ఎగుమతులతో ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహం పెరిగింది.

2. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వృద్ధి రేటు 8-8.5 శాతం ఉండొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.2 శాతంగా నమోదు కావొచ్చు. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలంటే మౌలిక వసతుల రంగంలో 1.4 ట్రిలియన్ల డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. 2008-17 (అంటే గడిచిన 9 ఏళ్ల కాలంలో) మధ్య కాలంలో మొత్తం 1.1 ట్రిలియన్ డాలర్లను జొప్పిస్తే.. అంతకంటే భారీ మొత్తాన్ని ఏడాదిలో జొప్పించనున్నట్లుగా పేర్కొన్నారు.

3. ప్రైవేటీకరణ వేగంవంతం చేయటానికి ఎయిరిండియా అమ్మకం ఊతమిచ్చింది. ఎయిరిండియాను టాటా సంస్థకు రూ.18వేల కోట్లకు అమ్మటం తెలిసిందే. అన్ని రంగాల్లోకి ప్రైవేటు వ్యక్తుల పాత్ర పెంచాల్సి అవసరం ఉంది. కొత్త స్టార్టప్ లు భారీగా వచ్చాయి. 2016-17లో 733 స్టార్టప్ లు వస్తే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 14 వేలు వచ్చాయి. దీంతో భారత్ ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ దేశంగా అవతరించింది.

4. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం లో కోవిడ్ టీకాలు కీలక భూమిక పోషించాయి. ఆరోగ్య సంరక్షణే కాదు ఆర్థిక వ్యవస్థ కోలుకోవటంలోనూ టీకా కీ రోల్ ప్లే చేసింది. దేశ వ్యాప్తంగా జనవరి 16 నాటికి 156 కోట్ల టీకాల డోసులు వేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 70-75 డాలర్ల మధ్యలో ఉండొచ్చు.

5. సెమీ కండక్టర్ల కొరతతో పలు పరిశ్రమలు మూతపడ్డాయి లేదంటే ఉత్పత్తిని తగ్గించాయి. చిప్ ల కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీలు 2021 డిసెంబరు నాటికి అక్షరాల 7 లక్షల కార్లు డెలివరీ చేయలేకపోయాయి. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు సెమీకండక్టర్లు.. డిస్ ప్లే తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.76 వేల కోట్ల ఖర్చుకు ముందుకు వస్తున్నాం.

6. కరోనా మొదటి.. రెండో వేవ్ కారణంగా దేశంలో గ్రహ అమ్మకాలు తగ్గినా వాటి ధరలు తగ్గలేదు. కొన్ని నగరాల్లో ఇంటి ధరలు పెరిగాయి. రెండు వేవ్ ల తర్వాత ఇంటి అమ్మకాలు పుంజుకున్నాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం.. కొన్ని రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీ తగ్గించటం కారణం. ఎప్పుడూ లేని రీతిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు వచ్చాయి. 2021 ఏప్రిల్ - నవంబరు మధ్యలో 75 కంపెనీలు ఐపీవోకి వచ్చాయి. రూ.89 వేల కోట్లను పైనే సమీకరించాయి. గడిచిన పదేళ్లలో ఇదే అత్యధికం.

7. జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుంది. 2020-21లో 13,327 కి.మీ. రోడ్ల నిర్మాణం జరిగింది. అంతకు ముందు ఏడాది 10,237 కి.మీ. మాత్రమే. దేశీయ ఫార్మా రంగంలో ఈ ఏడాది విదేశీ పెట్టుబడులు పోటెత్తాయి. 2021 ఏప్రిల్ - సెప్టెంబర్ మధ్యలో రూ.4,413 కోట్లు ఎఫ్డీఐల రూపంలో దేశ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చాయి.

8. కొవిడ్ కారణంగా పర్యాటక రంగం ఇంకా ఒడిదొడుకుల్ని ఎదుర్కొంటోంది. దేశానికి అంతర్జాతీయ పర్యాటకుల రాక తగ్గింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది.

9. మయన్మార్.. మలావి.. మొజాంబిక్ తో వంట నూనె కు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. దీంతో రానున్న కాలంలో వీటి ధరల పెరుగుదలకు కళ్లెం వేయొచ్చు. ప్రస్తుతం దిగుమతి సుంకాలతో వినియోగదారులకు తక్షణ ఉపశమనం కలిగిస్తున్నప్పటికి.. దేశీయ ఉత్పత్తిదారులకు తప్పుడు సంకేతాల్ని పంపినట్లు అవుతుంది. అందుకు దీర్ఘకాలిక స్థిరమైన విధానం తప్పనిసరి.

10. వరి.. గోధుమల సాగు నుంచి పప్పు ధాన్యాలు.. నూనె గింజల్ని పండించేందుకు వీలుగా రైతుల్ని కేంద్రం ప్రోత్సహిస్తోంది. దీంతో దేశం పప్పు ధాన్యాలు..నూనె గింజల స్వావలంబన పొందటంతో సహా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. వ్యవసాయ రంగ వృద్ధి 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3.9 శాతంగా నమోదు కావొచ్చు. పారిశ్రామిక వృద్ధి 11.8 శాతం ఉండొచ్చు. దేశీ ద్రవ్యలోటు అంచనాలు దాటొచ్చు.


ఈ ఆర్థిక సర్వేను ఎప్పటి నుంచి ప్రవేశ పెడుతున్నారు? దీన్ని ఎవరు తయారు చేస్తారన్న చరిత్రలోకి వెళితే.. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్‌శాఖలో ఎకనమిక్ డివిజన్ వారు దీన్ని రూపొందిస్తుంటారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (ముఖ్య ఆర్థిక సలహాదారు) ఆర్థిక సర్వే బాధ్యతల్ని చూసుకుంటారు.

తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ప్రవేశ పెట్టారు. దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తారు. మొదటి భాగంలో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను.. రెండో భాగంలో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి గత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు ఉంటాయి. ఇందులో ప్రభుత్వ పథకాలు.. విధివిధానాల గురించి వివరంగా తెలుసుకునే వీలు ఉంటుంది. అయితే.. ఈ ఏడాది రోటీన్ కు భిన్నంగా అన్ని వివరాల్ని ఒకటిగా తయారు చేసి.. సింగిల్ వాల్యూమ్ గా ఆర్థిక సర్వే విడుదల చేశారు.