Begin typing your search above and press return to search.

మహిళా అధికారిణికి హోంమంత్రి ఓపెన్ వార్నింగ్

By:  Tupaki Desk   |   15 Jan 2016 12:18 PM IST
మహిళా అధికారిణికి హోంమంత్రి ఓపెన్ వార్నింగ్
X
కీలక స్థానాల్లో ఉన్న అధికారుల గురించి ప్రజాప్రతినిధులు ఆచితూచి వ్యవహరించాలి. అధికారుల మీద అధిపత్యం కోసం ప్రజల ముందు పబ్లిష్ గా వారిని తిట్టేయటం అంత మంచిది కాదు. అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బ తినటంతో పాటు.. వారి పట్ల చులకన భావన ఏర్పడితే.. వారు పనులు చేయలేరు. అలాంటి ఇబ్బందికర పరిస్థితి తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈవో సుజాతా గుప్తాకు ఎదురైంది.

ఆమె తీరుపట్ల తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా కంటోన్మెంట్ పరిధిలోని కార్ఖానాలోని మూడో వార్డులో పనులకు శంకుస్థాపన సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడారు. ఈ సందర్భంగా సుజాత గుప్తాను ఉద్దేశించి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను బోర్డు సభ్యులను వేధించటం మానుకోవాలని.. జాగ్రత్తగా మసలుకోవాలని.. లేదంటే ఢిల్లీకి వెళ్లిపోవాలంటూ ఓపెన్ గా హెచ్చరించారు.

ఒకవేళ సీఈవో సుజాత గుప్తా వైఖరి సరిగా లేకుండా.. సున్నితంగా వ్యాఖ్యలు చేయటంతో పాటు.. చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలే కానీ.. ఇలా ఓపెన్ గా ఇంత తీవ్రస్థాయిలో విరుచుకుపడాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు.. నాయిని వ్యాఖ్యల మీద కంటోన్మెంట్ కార్మిక సంఘం నేతలు.. ఉద్యోగులు తప్పు పట్టటం గమనార్హం.