Begin typing your search above and press return to search.

హుదూద్‌ పై దృష్టిపెట్టండి బాబు!

By:  Tupaki Desk   |   26 Oct 2015 7:25 AM GMT
హుదూద్‌ పై దృష్టిపెట్టండి బాబు!
X
హుదూద్...విశాఖ‌ప‌ట్ట‌ణాన్ని వ‌ణికించిన ఈ భ‌యంక‌ర‌మైన తుపాను ఆ న‌గ‌రాన్ని తీవ్రంగా దెబ్బ‌తీసింది. అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం - గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టి ర‌క్ష‌ణ‌ - పున‌రావ‌స ప‌నులు పూర్తిచేసింది. అయితే హుదూద్ దాడికి ఏడాది పూర్త‌యిన‌ప్ప‌టికీ ఇంకా నిధులు విడుద‌ల కాక‌పోవ‌డంతో గ్రేట‌ర్ విశాఖ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు గ‌గ్గోలు పెడుతున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మరింత వేగంగా స్పందించాల్సి ఉంద‌ని కోరుతున్నారు.

హుదూద్ నేపధ్యంలో బాధితుల పునరావాసం, ర‌క్ష‌ణ‌ తదితర అంశాలతో పాటు తుపానుకు ధ్వంసమైన రోడ్లు, మంచినీటి వనరుల పునరుద్ధరణ పనులను అత్యవసర సేవల కింద చేపట్టాల్సి వచ్చింది. తుపాను అనంతరం నగరంలో కూలిన చెట్ల తొలగింపు, విద్యుత్ దీపాల పునరుద్ధరణ, మంచినీటి వనరుల పునరుద్ధరణ వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కోట్లాది రూపాయలను జీవీఎంసీ త‌న‌ సొంత నిధుల నుంచి వెచ్చించింది. హుదూద్ సమయంలోనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాతో పాటు పేరుకుపోయిన వృక్షాల వ్యర్ధాలు, చెత్త తరలింపునకు సైతం వందల సంఖ్యలో వాహనాలను వినియోగించాల్సి వచ్చింది. దీనితో పాటు ధ్వంసమైన డ్రెయిన్లు, రహదార్లను తాత్కాలికంగా పునరుద్ధరించేందుకు అప్పటికప్పుడు జీవీఎంసీ రూ.66 కోట్లను వెచ్చించింది.

తక్షణమే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరిగి వస్తాయని భావించిన జీవీఎంసీకి ఏడాది గడచినా నిధుల చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. హుదూద్ ఖర్చులో రూ.7 కోట్లను మాత్రమే తిరిగి చెల్లించిన ప్రభుత్వం మిగిలిన రూ.59 కోట్ల ఊసెత్తట్లేదని అధికారులు వాపోతున్నారు. మ‌రోవైపు హుదూద్ కారణంగా జీవీఎంసీ పరిధిలో రహదార్లు - గెడ్డలు - భూగర్భ మురుగునీటి వ్యవస్థ - పార్కులు - మంచినీటి పథకాలు సహా పలు విభాగాలకు రూ.1270 కోట్లు నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనావేశారు. ఈ మేరకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు.

అయితే ఉప‌శ‌మ‌నం క‌లిగించే మ‌రో నిర్ణ‌యాన్ని మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకుంద‌ని అధికారులు వివ‌రిస్తున్నారు. తీరంలో బీచ్ కోత నివారణకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూ.200 కోట్లను మంజూరు చేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్‌ ఐఓటి) బీచ్ కోత నివారణకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలపై నివేదికను అందజేయగా, ప్రభుత్వం సైతం దీనికి ఆమోదం తెలిపింది. దీంతో త్వ‌ర‌లో విశాఖ‌లో ఈ ప‌నులు మొద‌లు కానున్నాయి.