Begin typing your search above and press return to search.

పరిచయంతో ట్రాప్.. పబ్ నుంచి బయటకు తీసుకెళ్లి రేప్

By:  Tupaki Desk   |   4 Jun 2022 5:54 AM GMT
పరిచయంతో ట్రాప్.. పబ్ నుంచి బయటకు తీసుకెళ్లి రేప్
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ నకు సంబంధించిన చిక్కుముడులు దాదాపుగా వీడిపోయాయి. చాలా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సరికొత్త సవాలుగా మారింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కొడుకు నిందితుల్లో ఒకడు కావటం.. మరో ఎమ్మెల్యే కొడుక్కి సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరగటం (అతనికి సంబంధం లేదని.. ఫోన్ కాల్ రావటంతో వెళ్లిపోయినట్లుగా సమాచారం).. సంగారెడ్డికి చెందిన మరో కార్పొరేటర్ కొడుక్కి కూడా లింకు ఉందన్న ప్రచారం సాగింది.దీనికి తోడు ఈ గ్యాంగ్ రేప్ ను బీజేపీ సీరియస్ గా తీసుకోవటం.. శుక్రవారం సాయంత్రం తర్వాత కాంగ్రెస్ నేతలు కూడా రంగంలోకి దిగి.. బాధితురాలికి న్యాయం జరగాలని.. నిందితుల్ని తక్షణం అదుపులోకి తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటివరకు వెల్లడైన సమాచారం ప్రకారం ఈ గ్యాంగ్ రేప్ లో మొత్తం ఐదుగురు పాల్గొన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంతకూ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే.. మే 28న జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని అమ్నేషియా అండ్‌ ఇన్‌సోమ్నియా పబ్‌లో ఒక పార్టీ జరిగింది. ఈ పార్టీ నిర్వాహకుల్లో ఒకరు బాధిత బాలిక ఇంటికి దగ్గర్లో ఉన్న వ్యక్తి కావటం.. వారి కుటుంబంతో పరిచయం ఉండటంతో ఆమెను కూడా తీసుకెళ్లాడు. బాలిక తండ్రి విదేశీయుడు కాగా.. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లోనే స్థిరపడ్డారు. తల్లి ప్రైవేటు ఉద్యోగిని. వారికి ఒక కొడుకు.. కుమార్తె. పదహారేళ్ల బాధిత బాలిక ఓపెన్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది.

పార్టీకి వెళ్లిన బాలిక సంగీతం వింటూ.. అక్కడ వారు చేస్తున్న డ్యాన్స్ ను ఎంజాయ్ చేస్తున్న వేళ.. ఆమెతో ఒక కుర్రాడు మాట కలిపాడు. తర్వాత తన స్నేహితుల్ని పిలిచాడు. వారందరితో ఆమె స్నేహంగా మాట్లాడింది. తామంతా ఫ్రెండ్స్ అని చెప్పటంతో ఆ బాలిక సరేనంది. కాసేపటికి.. దగ్గర్లోని ఒక మంచి బేకరి ఉందని.. అందులో ఫేస్ట్రీలు బాగుంటాయని చెప్పటంతో.. వాటిని టేస్టు చేసేందుకు పబ్ బయటకు వచ్చారు. అనంతరం వారు బేకరికి వెళ్లి అక్కడ కాసేపు ఉన్నారు. పబ్ నుంచి రెండు కార్లలో బయలుదేరిన వారు.. తర్వాత ఒక కారు వెళ్లిపోవటం.. ఇన్నోవాలో తిరిగి బయలుదేరారు. బేకరి నుంచి బయలుదేరిన తర్వాత కాస్తంత నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో కారు నిలిపి.. అద్దాలు అన్ని ఎత్తేసి ఉండటంతో వారు గ్యాంగ్ రేప్ నకు పాల్పడినట్లుగా గుర్తించారు.

జరిగింది చెప్పొద్దని బెదిరించటంతో ఆమె భయపడిపోయింది. గ్యాంగ్ రేప్ అనంతరం ఆమెను పబ్ వద్ద వదిలి వెళ్లిపోయారు. తండ్రికి ఫోన్ చేయటంతో పబ్ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ముభావంగా ఉండటం.. ఆమె మెడ మీద గోళ్లతో గీరినట్లుగా ఉండటాన్ని తల్లి గమనించి.. ఏం జరిగిందంటే మౌనంగా ఉండిపోయింది. మరికాస్త రెట్టించి అడిగితే.. తనను వేధింపులకు గురి చేశారని చెప్పింది. దీంతో బాధిత బాలిక తండ్రి పార్టీ నిర్వాహకుడ్ని పిలిచి.. ఏం జరిగిందని ఆరా తీసి.. తన కుమార్తె వేధింపులకు గురైనట్లుగా గుర్తించారు.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెను భరోసా సెంటర్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ చేయగా.. తనకు జరిగిన అన్యాయం గురించి ఆమె నోరు విప్పింది. తనను కారులో గ్యాంగ్ రేప్ చేసినట్లుగా పేర్కొంది. తనపై ఆఘాయిత్యానికి పాల్పడిన వారిలో ఒకరిని గుర్తించింది. మిగిలిన వారిని గుర్తించలేదు. అనంతరం ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.

బాలిక చెప్పిన సమాచారంతో ఐదుగురిపై పోక్సో చట్టంతో పాటు సెక్షన్ 376 డీ కింద కేసు నమోదు చేశారు. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా చెబుతున్న ఇన్నోవా వాహనం కూడా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దేనని విచారణలో తేలింది. ఇక.. రెండో వాహనం నిందితుల్లోని ఒకరి మేనమామకు సంబంధించినదిగా చెబుతున్నారు.