Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో 10 వేల కోట్ల బ్లాక్ షీప్?

By:  Tupaki Desk   |   2 Oct 2016 7:47 AM GMT
హైదరాబాద్ లో 10 వేల కోట్ల బ్లాక్ షీప్?
X
హైదరాబాద్ ఇండస్ట్రియల్ సర్కిళ్లలో ఇప్పుడో విషయం తెగ ఆసక్తి రేపుతోంది. బ్లాక్ మనీ వెల్లడికి గడువు ముగియడం.. దేశంలో ఇప్పటికే వెల్లడైన జాబితా ప్రకారం 13 వేల కోట్లతో హైదరాబాద్ టాప్ లో ఉండడం ఒక ఎత్తయితే అందులో అందరిదీ 3 వేల కోట్లయితే కేవలం ఒక్క వ్యక్తి వద్దే 10 వేల కోట్లు ఉన్నట్లు వెల్లడించారని మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజానికి 13000 కోట్ల మొత్తానికి హైదరాబాదీలు వెల్లడించారన్న బిజినెస్ స్టాండర్డ్ కథనాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్వీట్ చేశారు. కానీ... ఆ సమాచారం ఎంతవరకు నమ్మదగిందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణంగా కేంద్రం ప్రాంతాల వారీగా నల్లధనం వివరాలు ఇవ్వలేదు. దీంతో ఈ తాజా ప్రచారం నిజమేనా కాదా? మరి కేంద్ర మంత్రి ట్వీట్ చేశారంటే అందులో నిజం ఉందని నమ్మాలా అన్న చర్చ జరుగుతోంది.

మరోవైపు స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించినవారి వివరాలను కేంద్రం బయటపెట్టదు. ఐడీఎస్ కింద నల్లధనం వివరాలు వెల్లడించినవారి సమాచారాన్ని కేంద్రం గోప్యంగానే ఉంచుతుంది. కానీ... ఒకే వ్యక్తి 10 వేల కోట్లను వెల్లడించారని చెబుతుండడంతో ఆ వివరాలు బయటకెలా వచ్చాయన్న ప్రశ్న వినిపిస్తోంది.

కాగా ఆ 10 వేల కోట్ల బ్లాక్ షీప్ ఎవరన్న చర్చ హైదరాబాద్ వ్యాపారవేత్తలు - పారిశ్రామికవేత్తల్లో జరుగుతోంది. ఇటీవల పనామా పేపర్లలో పేర్లు వచ్చినవారా.. లేదంటే ఫోర్బ్సు లిస్టులో కూడా ఎప్పుడూ ఎక్కకుండా... ఆ జాబితాలో ఉన్న ధనవంతుల కంటే పెద్ద ధనవంతులుగా ఉన్న కుబేరులా అని చర్చించుకుంటున్నారు. ఓ మీడియా అధిపతి పేరు.. కొందరు ఏపీ బడా కాంట్రాక్టర్ల పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి.