Begin typing your search above and press return to search.

సెల్లో బాయ్ ఫ్రెండ్ తో ముచ్చట్లు..హైదరాబాద్ లో అమ్మాయి దుర్మరణం

By:  Tupaki Desk   |   15 Jan 2020 5:21 AM GMT
సెల్లో బాయ్ ఫ్రెండ్ తో ముచ్చట్లు..హైదరాబాద్ లో అమ్మాయి దుర్మరణం
X
నిద్ర లేచింది మొదలు పడుకునే వరకూ చేతిలో తిరిగే సెల్ ఫోన్ తో లాభం సంగతి తర్వాత.. దాని కారణంగా జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. తమకు నచ్చిన.. మెచ్చిన మనుషులతోనే పరిమితమైపోతే.. అనుక్షణం దానితోనే గడుపుతున్న వారు.. కొన్ని సందర్భాల్లో ఊహించని ప్రమాదాలకు లోనై.. ప్రాణాల్ని కోల్పోతున్నారు. తాజా ఉదంతం ఆ కోవకే చెందిందే. హైదరాబాద్ శివారుకు చెందిన ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తూ.. మూడంతస్తుల మీద నుంచి కిందకు పడిపోయి ప్రాణాలు కోల్పోయిన దారుణం చోటు చేసుకుంది.

కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా ముధోల్ టౌన్ విద్యాగిరి నగర్ కు చెందిన 22 ఏళ్ల సిమ్రాన్ హైదరాబాద్ శివారులోని శంషాబాద్ మండల కేంద్రంలో ఉంటోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమర్ సర్వీసెస్ విభాగంలో పని చేస్తోంది. శంషాబాద్ లోని ఒక భవనంలో అద్దెకు ఉంటోంది.

మంగళవారం సాయంత్రం 5 గంటల వేళలో తాను అద్దెకు ఉండే భవనం పైకి వెళ్లిన ఆమె.. సెల్ ఫోన్ లో తన బాయ్ ఫ్రెండ్ తో ఛాటింగ్ చేస్తోంది. ఆ ధ్యాసలో ఉన్న ఆమె ముంచుకొస్తున్న ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. మూడంతస్తుల భవనం నుంచి పొరపాటున జారి పడిన ఆమెకు తీవ్ర గాయాలు కావటంతో అక్కడికక్కడే మరణించారు.

పై నుంచి ఒక్కసారిగా కిందకు పడటంతో అక్కడే ఉన్న ప్రత్యక్ష సాక్ష్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెనువెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. మరణించిన సిమ్రాన్ వివరాల్ని సేకరించిన పోలీసులు.. కర్నాటకలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఫోన్ మాట్లాడాలి.. కానీ ఆ లోకంలో పడి.. ముంచుకొచ్చే ముప్పులో ప్రాణాలు కోల్పోవటం విషాదకరంగా చెప్పక తప్పదు.