Begin typing your search above and press return to search.

ఇండియన్ రైల్వేలో హైడ్రోజన్ 'కూత'..!

By:  Tupaki Desk   |   29 Dec 2022 5:37 AM GMT
ఇండియన్ రైల్వేలో హైడ్రోజన్ కూత..!
X
పర్యావరణ కాలుష్యానికి చెక్ పెట్టేలా ఇండియన్ రైల్వే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సరికొత్త రైళ్లను కొత్త ఏడాదిలో ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలోనే 2023లో భారతీయ పట్టాలపై హైడ్రోజన్ రైళ్లు కూత పెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. పారిస్ ఒప్పందంలో భాగంగా భారత్ కర్బన ఉద్గారాలను తగ్గించే క్రమంలో తన వంతు బాధ్యతగా రైల్వేలో డీజిల్ ఇంజన్ స్థానంలో హైడ్రోజన్ తో నడిచే ఇంజిన్లను తీసుకు రాబోతుంది.

రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇండియన్ రైల్వేస్ లో మొత్తం రైళ్లలో 37శాతం డీజిల్ ఇంజన్లతోనే నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో వెలువడుతున్న గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో రవాణా రంగం వాటా 12 శాతం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. వీటిలో రైల్వే శాఖ వాటా నాలుగు శాతంగా ఉంది. ఈ ఉద్గారాలకు డీజిల్ ఇంజన్లే ప్రధాన కారణంగా కన్పిస్తున్నాయి.

గతేడాదిలో రైల్వే శాఖ 237 కోట్ల లీటర్ల డీజిల్ ను వినియోగించింది. అయితే 2030 నాటికి జీరో స్థాయికి ఉద్గారాలను తగ్గించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ హైడ్రోజన్ రైళ్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ హైడ్రోజన్ రైళ్ల ద్వారా విద్యుద్ధీకరణ సరిగా లేని ప్రాంతాల్లోనూ రైళ్లు నడిపే అవకాశం లభించనుంది. ఇది గ్రామీణ ప్రాంతాలకు వరంగా మారనుంది.

డీజిల్ ఖర్చుతో పోలిస్తే హైడ్రోజన్ ఖర్చు తక్కువేనని తెలుస్తోంది. వీటి ద్వారా కర్భన ఉద్గారాలు ఏమాత్రం అవకాశం ఉండదు. హైడ్రోజన్ నుంచి కేవలం నీరు.. ఆవిరి మాత్రమే బయటికి వెలువడుతాయి. ఇది పర్యావరణానికి.. ప్రజల ఆరోగ్యానికి మేలు చేయనుంది. ఒక కిలో హైడ్రోజన్ అనేది 4.5 కిలోల డీజిల్ కు సమానమైన శక్తిని సమకూరుస్తుంది. ఈ రైళ్ల నుంచి పెద్దగా శబ్దాలు కూడా రావు. దీంతో శబ్ద కాలుష్యం కూడా తగ్గుతుంది.

ఇక భూమిపై హైడ్రోజన్ కు కొరత లేకపోవడం భవిష్యత్తులో ఇంధన సమస్య కూడా ఉండదు. సముద్ర నీటి నుంచి హైడ్రోజన్ ను విరివిగా సేకరించింది. 20 నిమిషాల్లోనే ఇంధనాన్ని పూర్తి నింపవచ్చు. ఇప్పటికే ఈ రైళ్లను జర్మనీలో వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో ప్రపంచంలోని తొలి హైడ్రోజన్ రైలును జర్మనీ ప్రవేశపెట్టింది.

దీనికి 'కొరాడియా ఐలింట్' అని నామకరణం చేసింది. వీటిని ఆల్ స్టోమ్ సంస్థ రూపొందించింది. జర్మనీలోని లోవర్ శాక్సోనీ ప్రాంతంలో 62 మైళ్ల రూట్ లో 14 హైడ్రోజన్ రైళ్లు ప్రతినిత్యం సేవలందిస్తున్నారు. భారత్ సైతం కొత్త ఏడాదిలో హైడ్రోజన్ రైళ్లు ప్రవేశ పెట్టనుండటంతో మన పట్టాలపై హైడ్రోజన్ కూత పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.