Begin typing your search above and press return to search.

డ్రీమ్ గర్ల్... పొలిటికల్ రిటైర్ మెంట్

By:  Tupaki Desk   |   23 Oct 2019 1:13 PM GMT
డ్రీమ్ గర్ల్... పొలిటికల్ రిటైర్ మెంట్
X
హేమామాలిని....ప్ర‌ముఖ సినీన‌టి - ప్ర‌స్తుత బీజేపీ ఎంపీ. అందానికి పెట్టింది పేరుగా ఈ బాలీవుడ్ డ్రీమ్‌ గ‌ర్ల్‌ ను ప‌లువురు పేర్కొంటున్నారు. ఈ ఎంపీని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ నేత‌లు సైతం ప్ర‌శంసిస్తుండ‌టం ఆమెకు ద‌క్కే ప్ర‌శంస‌ల‌కు నిద‌ర్శ‌నం. కొద్దికాలం క్రితం భారీ వర్షం కురిసి రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలుగా మారిపోయినందున వెంటనే చర్యలు తీసుకోవాలని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ సీఎం కమల్ నాథ్ ఆదేశాలు జారీ చేస్తే..ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి పీసీ శర్మ స్పందిస్తూ....15 రోజుల్లో మరమ్మతులు చేసి రోడ్లన్నీ ఎంపీ హేమామాలిని బుగ్గల్లా తయారు చేస్తామంటూ వ్యాఖ్యానించారు. అలా విప‌క్షాల‌తో సైతం ప్ర‌శంస‌లు పొందే ఆమె తాజాగా కీల‌క నిర్ణ‌యం వెలువ‌రించారు. రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల‌ని అనుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

గ‌త ఎన్నిక‌ల్లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని మథుర నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన హేమామాలిని స్థానికంగా అప్ప‌టికే ఒకింత వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ...బీజేపీ గాలిలో గెలుపొందారు. తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన మ‌థుర ఎంపీ...ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీగా ఉన్న తాను ఇక రాజకీయ జీవితం చాలించి కుటుంబంతో సంతోషంగా గడపాలనుకుంటున్నట్లు చెప్పారు. మరో నాలుగేళ్లకు పైనే ఆమె ఎంపీగా కొనసాగే అవకాశాలున్న‌ప్ప‌టికీ...హేమామాలిని ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంద‌ర్భంగా వ్య‌క్తిగ‌త జీవితం గురించి కూడా...ఆమె ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు.

పెళ్లై నలుగురు పిల్లలున్నా నటుడు ధర్మేంద్రపై మనసు పడటం...ఆయ‌న్ను రెండో పెళ్లి చేసుకోవ‌డం గురించి హేమామాలిని వివ‌రించారు. ``ధర్మేంద్రతో క‌లిసి షోలే - సీతా ఔర్ గీతా చిత్రాల్లో నటించిన స‌మ‌యంలోనే మా మధ్య ప్రేమకు బీజం పడింది. ఎందుకో ఆయన్ని చూడగానే సొంత మనిషిలా అనిపించారు. ఆ క్షణంలోనే ఆయన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నాం. 1979 ఆగస్టులో పెళ్లి చేసుకున్నాం.`` అని వెల్ల‌డించారు. అయితే మొదటి భార్యనుంచి - ఆమె పిల్లల నుంచి అతడిని దూరం చేయాలనే ఉద్దేశం అసలు లేదు. అందుకే ఆ విషయాల్లో నేను తల దూర్చను అని ఓ హేమామాలిని స్ప‌ష్టం చేశారు. కాగా, ధ‌ర్మేంద్ర 19 ఏళ్ల వయసున్నప్పుడు 1954లో ప్రకాష్ కౌర్‌ తో వివాహం జరిగింది. వీరికి సన్నీ డియోల్ - బాబీ డియోల్ - విజేతా - అజేత అని నలుగురు పిల్లలు ఉన్నారు. ఇక ధ‌ర్మేంద్ర‌- హేమామాలిని దంప‌తుల‌కు ఈషా - అహనా అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.